దేశీయ రహదారులకు కొత్త రూపునిస్తున్న జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ దేశం గర్వించేలా సరికొత్త రికార్డు నెలకొల్పింది. 105 గంటల్లోనే 75 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించి ఖతార్ పేరిట ఉన్న గిన్నిస్ రికార్డును తిరగరాసింది. మహారాష్ట్రలోని అమరావతి- అకోలా జిల్లాల మధ్య ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తం 720 మంది కార్మికులు రేయింబవళ్లు కష్టించి ఈ నిర్మాణాన్ని పూర్తిచేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జూన్ 3న ఉదయం 7.27కి ఈ పనులు ప్రారంభించగా.. జూన్ 7 సాయంత్రం 5 గంటలకు ఈ పనులు పూర్తయినట్లు మంత్రి ఓ వీడియో సందేశంలో వివరించారు. అలాగే రహదారి నిర్మాణ పనులు, గిన్నిస్ బుక్ వారు అందించిన సర్టిఫికెట్ను సైతం సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. గతంలో ఈ రికార్డు ఖతార్ పేరిట ఉండేది. 10 రోజుల్లో 25.275 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించి ఆ దేశం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఈ రికార్డులో భాగస్వాములైన NHAI, రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, కార్మికులను మంత్రి అభినందించారు.
105 గంటల్లో 75 కిలోమీట్ల రహదారి నిర్మాణం
June 08, 2022
0
Tags