పాటీదార్ ఉద్యమ నేత, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్థిక్ పటేల్ పార్టీకి రాజీనామా చేశారు. అత్యవసరమైన పరిస్థితుల్లో పార్టీకి అందుబాటులో ఉండాల్సిన తమ నేత విదేశాలకు వెళుతుంటారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు. ఈ మేరకు పూర్తి వివరణతో రెండు పేజీలతో కూడిన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. అలాగే ట్విటర్లోనూ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేస్తున్నానని, తన నిర్ణయాన్ని సహచరులు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని అన్నారు. గుజరాత్ రాష్ట్ర భవిష్యత్ కోసమే తాను తీసుకున్న ఈ చర్య ఉపయోగపడుతుందని భావిస్తున్నానని ఆ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనకు వచ్చిన సమయంలో హార్థిక్ పటేల్తో భేటీ కాలేదు. ఈ అంశంపై స్పందిస్తూ తాను అగ్ర నేతలతో సమావేశమైనపుడు వారు రాష్ట్ర సమస్యలను వినకుండా మొబైల్ ఫోన్లలో మాట్లాడతారని, లేదా పట్టించుకోనట్లుగా ప్రవర్తిస్తారని మండిపడ్డారు. గుజరాత్ ప్రజలను వారు విస్మరిస్తున్నారని, ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాల అభివృద్ధిపై సరైన వ్యూహ రచన లేకపోవడం వలనే కాంగ్రెస్ను ప్రతి రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తున్నారని విమర్శించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొద్ది రోజులుగా పార్టీ విధానాల పట్ల అసంతఅప్తి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలసిందే.
కాంగ్రెస్ పార్టీని వీడిన హార్థిక్ పటేల్
May 18, 2022
0
Tags