దేశానికి పతకాలను అందించి భారతీయులను గర్వపడేలా చేసిన క్రీడాకారులు నేడు అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాల నుంచి కనీస సాయం కూడా అందకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. స్పెషల్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు సాధించిన సీతా సాహు సమోసాలు అమ్ముకుంటున్న ఘటనను మరవకముందే మరో వార్త అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. నేషనల్ చాంపియన్ (పారా అథ్లెట్) సచిన్ సాహు జీవనోపాధి కోసం ఐస్క్రీమ్ బండి నడుపుకుంటున్నాడు. మధ్యప్రదేశ్కు చెందిన సచిన్ ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరిగిన 20వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించాడు. ఈ రేసును సచిన్ 1.17 సెకన్లలో పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ప్రభుత్వం తనకు ఎలాంటి సాయం అందకపోవడంతో తాను ఇలా ఐస్క్రీమ్స్ అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సచిన్ 2015 నుండి 2019 వరకు క్రికెట్ ఆడాడు. కానీ, దివ్యాండైన కారణంగా క్రికెట్లో పెద్దగా రాణించలేకపోయాడు. అనంతరం.. గ్వాలియర్ అథ్లెటిక్స్ కోచ్ బీకే ధవన్ సాయంతో పారా అథ్లెట్గా మారి కాంస్య పతకం సాధించాడు.