హనుమజ్జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలో 9 మంది అరెస్ట్ అయ్యారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరో 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హింసాత్మక ఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో 8 మంది పోలీసులు, ఒక పౌరుడు ఉన్నాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణను ప్రారంభించామని ఢిల్లీ పోలీసు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ హింసాకాండకు సంబంధించి దాదాపు 100 సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, అవి కూడా తమకు దొరికాయని తెలిపారు. ఈ సీసీ ఫుటేజీల ఆధారంగానే ఈ అల్లర్లకు కారకులైన మరికొంత మందిని గుర్తిస్తామని, అంతేకాకుండా స్పెషల్ టీమ్, స్పెషల్ సెల్ పోలీసులు కూడా రంగంలోకి దిగామని అధికారులు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన శోభాయాత్ర హింసాత్మకంగా మారింది. రెండువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఘర్షణల్లో సాధారణ పౌరులతోపాటు పోలీసులు కూడా గాయపడ్డారు. జహంగిర్పూరి ప్రాంతంలోని కుశాల్ సినిమా థియేటర్ దగ్గరకు రాగానే ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు విసిరేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు. రాళ్లదాడిలో పలు వాహనాలు, దుకాణాలు ధ్వంసమైనట్టు పేర్కొన్నారు. కొన్ని వాహనాలకు దుండగులు నిప్పు పెట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్తానా తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. సోషల్మీడియాలో ప్రచారమయ్యే వదంతులను నమ్మొద్దని పౌరులకు సూచించారు.
ఢిల్లీ హనుమజ్జయంతి అల్లర్లు
April 17, 2022
0