మంత్రులు తమ సొంత ఆస్తులతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను మూడు నెలల్లోగా ప్రకటించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. అంతే కాకుండా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కూడా తమ ఆస్తుల్ని ప్రకటించాలని ఆదేశించారు. ఆన్లైన్లో వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో యోగి ఆదిత్యనాథ్ ఆస్తుల వివరాలు పొందుపరిచారు. లిక్విడ్ క్యాష్, బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో తనకు ఒక కోటి 54 లక్షల ఆస్తులున్నట్టు అందులో యోగి తెలిపారు. ఇక మంత్రులు, ఉన్నతాధికారులు అధికారిక పర్యటనల్లో ప్రైవేట్ హోటళ్లకు వెళ్లకుండా ప్రభుత్వ అతిథి గృహాల్లోనే ఉండాలన్నారు. మంత్రుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం ప్రజా ప్రతినిధుల ప్రవర్తన ఎంతో ముఖ్యమన్నారు. ఆ స్పూర్తితో మంత్రులు తమతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు తెలపాలని యోగి ఆదేశించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మూడు నెలల్లోపు వివరాలు ప్రకటించాలన్నారు. 2017లో ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసిన వెంటనే మంత్రులందరూ ఏటా మార్చి 31లోగా తమ ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశించారు. 5 వేలకు పైబడిన ఎలాంటి గిఫ్ట్లు తీసుకోవద్దని, విలాసవంతమైన నివాసాలకు, పార్టీలు, డిన్నర్లకు దూరంగా ఉండాలని చెప్పారు.
మూడు నెలల్లోగా మంత్రుల ఆస్తుల వివరాలు ప్రకటించాలి !
April 27, 2022
0
Tags