మార్చి 30న బెంగళూరులోని యలహంక రైల్వేస్టేషన్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఆ రోజు మధ్యాహ్నం రైల్వే పోలీసులకు ఓ ఫోన్ వచ్చింది. 'రైల్వేస్టేషన్లో బాంబు పెట్టాం.. ఏక్షణమైనా పేలొచ్చు' అని దాని సారాంశం. స్టేషన్ లోపల ఉన్న ప్రయాణికులను రైల్వే పోలీసులు, బాంబు నియంత్రణ దళ సభ్యులు హుటాహుటిన బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. చివరకు బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకుని ఉత్తుత్తి బెదిరింపుగా గుర్తించారు. విచారణలో భాగంగా స్టేషన్లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసి బెదిరించింది 12 ఏళ్ల బాలుడని పోలీసులు గుర్తించారు. 'గత నెల 30న నేను, నా స్నేహితుడు పబ్జీ ఆడుతున్నాం. ఆట మధ్యలో ఉంది. నా స్నేహితుడు కాచిగూడ ఎక్స్ప్రెస్లో వేరే ఊరు వెళ్లాల్సిన సమయం వచ్చింది. అతను వెళ్తే ఆట ఆగిపోతుంది. ఎలాగైనా ఆ ప్రయాణాన్ని ఆపాలనుకున్నా. అందుకే బాంబు ఉందని ఫోన్ చేశా' అని బాలుడు పేర్కొన్నాడు. అతడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోలీసులు కేసు నమోదు చేయకుండా హెచ్చరించి విడిచిపెట్టారు.
బాంబు పెట్టామంటూ బాలుని బెదిరింపు ఫోన్ కాల్ !
April 04, 2022
0
Tags