కేరళకు చెందిన ఓ బస్సు మున్నార్కు ప్రయాణికులను చేరవేసేందుకు బయలుదేరింది. మార్గమధ్యంలో ఓ మలుపు దగ్గర అడవి ఏనుగు ఎదురైంది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులందరూ తమ సెల్ ఫోన్లలో ఆ గజరాజు వీడియోను తీసేందుకు పోటీపడ్డారు. దీంతో ఒక్కసారిగా అది బస్సు దిశగా రావడంతో అంతా నిశ్శబ్దమైంది. ప్రయాణికుల్లో కలవరం మొదలైంది. డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి మాత్రం ఏ మాత్రం జడవకుండా ప్రశాంతంగా గమనిస్తూ కూర్చున్నాడు. అదే సమయంలో ఏనుగు తొండం పైకెత్తి వాహనాన్ని తడిమింది. దాని దంతాలు తగిలి అద్దానికి పగుళ్లు ఏర్పడ్డాయి. అయినా బస్సు డ్రైవర్ ఏమాత్రం బెదరలేదు. కొద్ది సేపటి తర్వాత అక్కడి నుంచి ఏనుగు పక్కకు తప్పుకోవడంతో బస్సును మెల్లిగా ముందుకు పోనిచ్చాడు. ఇదంతా అందులో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికుల అరుపులు, కేకలకు ఏనుగులు బెదిరిపోయి దాడికి పాల్పడుతుంటాయి. కానీ ఈ వీడియోలో ఏనుగు ప్రవర్తనను అంచనా వేసిన ఆ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి తప్పించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు డ్రైవర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'నిజమైన హీరో' అంటూ కొనియాడుతున్నారు. అపాయం కళ్ల ముందే ఉన్నా సమయస్ఫూర్తితో వ్యవహరించడంపై ప్రశంసలు అందుకుంటున్నాడు.
డ్రైవర్ సమయస్ఫూర్తి !
April 07, 2022
0
Tags