పాత బస్తీలోని మక్కా మసీదు ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి రంగంలోకి దిగారు. వెహికల్స్ పార్కింగ్ కోసం యునాని హాస్పిటల్ గేట్లు తెరిపించాడు. ఇంతలో పోలీసులు రావడంతో ఆయన కోపంతో ఊగిపోయాడు. అసలు మీకు ఇక్కడ ఏం పని, ఎందుకొచ్చారంటూ ఎస్ఐపై నిప్పులు చెరిగారు. ఫోన్ వస్తే వచ్చానని పోలీసులు చెప్పే ప్రయత్నం చేసినా కార్పొరేటర్ వినిపించుకోలేదు. అదే సమయంలో పోలీసులకు యునాని హాస్పిటల్ సిబ్బంది ఫోన్ చేశారని తెలిసి వారిపై సీరియస్ అయ్యారు. గట్టి గట్టిగా అరుస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రంజాన్ మాసంలో మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ప్రార్థనలు చేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వాళ్లందరికీ పార్కింగ్ను యునాని హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి మాత్రం అలా చేయలేదు. యునాని వైద్యశాల గేట్లు మూసివేశారు. దీంతో మక్కా మసీదులో ప్రార్థనలకు వచ్చిన వారంతా రోడ్లపై పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. దీంతో ఇటు కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి రావడం అటు పోలీసులు రావడంతో వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసు పవర్ చూపిస్తామంటే ఇక్కడ నడవదు అంటూ ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. యునాని హాస్పిటల్లోనే పార్కింగ్ కంటిన్యూ అవుతుందని, మీరేం చేస్తారో చూస్తాం అంటూ రుబాబు ప్రదర్శించడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. కాసేపు వాగ్వాదం తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.