రాజస్థాన్ కానిస్టేబుల్ కు ప్రమోషన్ ... !

Telugu Lo Computer
0


రాజస్థాన్ లో కొద్దిరోజులుగా మతపరమైన ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. గత శనివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన బైక్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో కొందరు వారిపై రాళ్లతో దాడి చేశారు. వెంటనే కొన్ని వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా కరౌలీ వీధిలో కొంతమంది అల్లరి మూకలు అమాయకుల ఇళ్లను కాల్చేశారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నేత్రేష్ శర్మ మంటల్లో చిక్కుకున్న ఇద్దరు మహిళలతో పాటు, పసికందు ప్రాణాలు కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేత్రేష్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ధైర్య సాహసాలతో పసికందు, మహిళల ప్రాణాలు కాపాడిన నేత్రేష్ శర్మకు ప్రమోషన్, గ్యాలంటరీ అవార్డుతో సత్కరించాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తమైంది. కానిస్టేబుల్ ధైర్య సాహసాలకు హృదయపూర్వక ధన్యావాదాలు అంటూ నెటింట్లో నెటిజర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. వీరితో పాటు పోలీస్ ఉన్నతాధికారులు, పలువురు రాజకీయ ప్రముఖులు నేత్రేష్ ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. ఈ విషయం సీఎం అశోక్ గెహ్లాట్ దృష్టికి వెళ్లడంతో స్వయంగా నేత్రేష్ కు ఫోన్ చేసి మాట్లాడారు. అంతేకాక కానిస్టేబుల్ గా ఉన్న నేత్రేష్ ను హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు నేత్రేష్ శర్మ ధైర్య సాహసాలను పోలీస్ ఉన్నతాధికారులు ప్రశంసించారు. ప్రాణాలుసైతం లెక్క చేయకుండా బాధ్యతగా వ్యవహరించిన నేత్రేష్ శర్మ తీరుతో పోలీస్ శాఖకే గర్వకారణమని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన నేత్రేష్ శర్మ అది నా బాధ్యత అంటూ పేర్కొన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)