భారత్‌లో పేదరికం 12.3 శాతం తగ్గింది

Telugu Lo Computer
0


భారత్‌లో పేదరికం 12.3 శాతం తగ్గిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. 2011తో పోల్చితే 2019లో పేదరికం పరిస్థితి మెరుగుపడిందని చెప్పింది. 2011లో 22.5 శాతం ఉన్న పేదరికం 2019లో 10.2 శాతానికి పడిపోయిందని వివరించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గణనీయంగా తగ్గిందని పరిశోధన నివేదికలో ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 2011లో 26.3 శాతం నుంచి 2019లో 11.6 శాతానికి దిగజారినట్లు తెలిపింది. అలాగే అదే కాలంలో అర్బన్‌ ప్రాంతాల్లో పేదరికం 14.2 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గిందని వివరించింది. 2011-2019లో గ్రామీణ, పట్టణ పేదరికం 14.7, 7.9 శాతం పాయింట్లు తగ్గాయని ఆ నివేదిక పేర్కొంది. మరోవైపు చిన్న కమతాలున్న రైతులు అధిక లాభాలు గడించారని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. 2013, 2019లో చేసిన రెండు సర్వేల ప్రకారం పెద్ద కమతాలున్న రైతుల వార్షిక ఆదాయం 2 శాతం మేర పెరుగ్గా, చిన్న రైతుల ఆదాయం పది శాతం మేర పెరిగిందని వివరించింది. అయితే 'భారతదేశంలో గత దశాబ్దంలో పేదరికం తగ్గింది కానీ ఇంతకు ముందు అనుకున్నంతగా కాదు' అని వ్యాఖ్యానించింది. ఆర్థికవేత్తలు సుతీర్థ సిన్హా రాయ్, రాయ్ వాన్ డెర్ వీడ్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించారు. అభివృద్ధిపై ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించడం, పరిశోధన ఫలితాలను త్వరగా వ్యాప్తి చేయడం లక్ష్యంగా ప్రపంచ బ్యాంకు పాలసీ మేరకు ఈ నివేదికను తయారు చేసినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) పరిశోధన నివేదికకు, ప్రపంచ బ్యాంకు పరిశోధన నివేదికకు దగ్గర పోలికలున్నాయి. భారతదేశం దాదాపుగా అత్యంత పేదరికాన్ని నిర్మూలించిందని ఐఎంఎఫ్‌ నివేదిక తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ఆహార పంపిణీ వల్ల వినియోగదారుల మధ్య అసమానతలు 40 ఏండ్ల కనిష్ఠ స్థాయికి తగ్గాయని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)