కుంభకోణం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఆటోడ్రైవర్ !

Telugu Lo Computer
0


అతను ఓ సాధారణ ఆటోడ్రైవర్ కానీ ఇప్పుడు ఓ కార్పోరేషన్‌కి మేయర్. తమిళనాడులోని తంజావూరు జిల్లాకు చెందిన 42 ఏళ్ల శరవణన్ ఓ ఆటో డ్రైవర్... తన భార్య దేవి, ముగ్గురు పిల్లలతో కలిసి తుక్కంపాళయంలో అద్దె ఇంట్లో ఉంటూ రెండు దశాబ్దాలుగా ఆటోరిక్షా నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల తమిళనాడులో జరిగిన కుంభకోణం కార్పోరేషన్ ఎన్నికల్లో 17వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా మొదటిసారి పోటీ చేసి గెలిచాడు. ఎన్నికల్లో మొత్తం 2,100 ఓట్లు పోల్ అవ్వగా అందులో 964 ఓట్లు సాధించాడు. తమిళనాడులో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార డీఎంకేతో కలిసి కాంగ్రెస్‌ పోటీ చేసింది. అయితే ఇందులో డీఎంకే 21 కార్పొరేషన్లలో 20 కార్పొరేషన్లకు మేయర్లను ఎంపిక చేసింది. ఒక్క కార్పొరేషన్ మేయర్ పదవిని మాత్రం కాంగ్రెస్ కు కేటాయించింది. అది కూడా కొత్తగా ఏర్పడిన కుంభకోణం మున్సిపల్ కార్పొరేషన్. దీనికి తమిళనాడు కాంగ్రెస్ కమిటీ శరవణన్‌ను మేయర్‌గా ఎన్నుకుంది. మేయర్‌గా ఎన్నికవ్వడం తనకి ఆనందంగా ఉందని.. అయితే ప్రజలకు సేవ చేస్తూ ఆటో నడపడంలో ఇంకా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు శరవణన్. మేయర్ గా ప్రమాణ స్వీకారం తర్వాత నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం పైన పెడతానని చెప్పాడు.. ప్రమాణ స్వీకారానికి కూడా శరవణన్ సాధారణ ఆటోడ్రైవర్ గానే రావడం విశేషం. 

Post a Comment

0Comments

Post a Comment (0)