పాకిస్తాన్ లోని అధికార పార్టీ ప్రధాన మిత్ర పక్షమైన ముతాహిదా ఖుయామి మూమెంట్ పాకిస్తాన్ ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అవిశ్వాస తీర్మానానికి రాకుండానే ఇమ్రాన్ఖాన్ మెజార్టీని కోల్పోయారు. ప్రతిపక్షాల కూటమితో ఎంక్యూఎం ఒప్పందం కుదుర్చుకుందని, రాబ్తా కమిటీ ఎంక్యూఎం, పిపిసి సిఇసి ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తుందని దీనికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడిస్తామని పిపిపి చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి మంగళవారం రాత్రి ట్విటర్లో ప్రకటించారు. ఈ మధ్యాహ్నం ఎంక్యూఎం పార్టీకి చెందిన మంత్రులు, సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. దీంతో అసెంబ్లీలో ఇమ్రాన్ఖాన్ బలం మరింత తగ్గనుంది. పాక్ సంకీర్ణ ప్రభుత్వంలో పిటిఐకి ప్రధాన మిత్ర పక్షం ఎంక్యూఎంపినే. ఈ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు ఇప్పటివరకు ప్రభుత్వానికి మద్దతుగా ఉండటంతో పాటు మంత్రులుగానూ కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఎంక్యూఎంపి ప్రతిపక్షానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మెజార్టీ మార్క్ను కోల్పోనుంది. ఎంక్యూఎంపి సభ్యులు రాజీనామా చేస్తే ఇమ్రాన్ ప్రభుత్వ బలం 164కు తగ్గుతుంది. అదే సమయంలో ప్రతిపక్షాల బలం 176కు పెరగనుంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పిటిఐకి చెందిన 24 మంది సభ్యులు కూడా ఇమ్రాన్పై తిరుగుబాటు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్ఖాన్పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మార్చి 31న చర్చ జరగనుంది. ఏప్రిల్ 3 ఆదివారం దీనిపై ఓటింగ్ నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుత సభ్యుల సంఖ్య ప్రకారం ఇమ్రాన్ఖాన్పై ప్రతిపక్షాల అవిశ్వాసం నెగ్గేలా కన్పిస్తోంది. 342 మంది సభ్యులున్న పాకిస్తాన్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ తన బలాన్ని నిరూపించుకోవాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం.
మెజార్టీని కోల్పోయిన ఇమ్రాన్ఖాన్
March 30, 2022
0
Tags