చైనా ఈస్టర్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం కున్మింగ్ నుంచి గువాంగ్ ఝౌకు వెళుతుండగా వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో కూలిపోయినట్లు ప్రాంతీయ విపత్తు స్పందన విభాగం వెల్లడించింది. ఈ ప్రమాదంలో పర్వత ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలోని వారి పరిస్థితిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. విమానంలో మొత్తం 132 మంది ఉండగా.. అందులో 123 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నట్లు చైనా పౌర విమానయాన విభాగం తమ వెబ్సైట్లో పేర్కొంది. ప్రస్తుతానికి మరణాలపై ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన ఈ MU5735 విమానం.. కున్మింగ్ నుంచి గువాంగ్ఝౌకు రావాల్సి ఉండగా సమయానికి గమ్యాన్ని చేరుకోలేదని బైయున్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. స్థానిక కాలమాన ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.10 గంటలకు కున్మింగ్లో బయలుదేరింది. గువాంగ్ఝౌ నగరానికి మధ్యాహ్నం 2.52 గంటలకు చేరుకోవాల్సి ఉంది. అయితే, వూఝౌ సమీపంలో కూలిపోయినట్లు సమాచారం అందిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే కొండ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్న కొన్ని వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. చైనాకు చెందిన మూడు ప్రధాన విమానయాన సంస్థల్లో చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఒకటి. ఫిబ్రవరి 19 నాటికి 100 మిలియన్ గంటలు సురక్షితంగా విమాన ప్రయాణాలను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
చైనాలో ఘోర విమాన ప్రమాదం
March 21, 2022
0