దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో 4 కోట్ల 70 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 2 వరకు ఒక్క సుప్రీంకోర్టులోనే 70 వేల 154 కేసులు పెండింగ్లో ఉండగా మార్చి 21 నాటికి 25 హైకోర్టుల్లో 58 లక్షల 94 వేల 60 పెండింగ్ కేసులు ఉన్నట్టు లోక్సభకు తెలిపింది. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ గణాంకాలను వెల్లడించారు. వివిధ జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టుల్లో కలిపి 4 కోట్ల 10 లక్షల 47 వేల 976 కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. అరుణాచల్ప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన గణాంకాలు నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్లో అందుబాటులో లేవన్నారు. దేశవ్యాప్తంగా మొత్తంగా 4 కోట్ల 70 లక్షల 12 వేల 190 కేసులు పెండింగ్లో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. పెండింగ్ కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థ పరిధిలోనిదని, ఆయా కోర్టుల్లో పలు రకాల కేసుల పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితీ నిర్దేశించలేదన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. న్యాయమూర్తుల ఖాళీలు, తరచూ కేసులు వాయిదా పడటంతో పాటు విచారణల కోసం కేసుల్ని పర్యవేక్షించేందుకు, ట్రాక్ చేయడానికి తగిన ఏర్పాట్లు లేవని గమనించినట్టు తెలిపారు.
దేశంలో 4.70 కోట్ల పెండింగ్ కేసులు !
March 26, 2022
0
Tags