ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్న వారిపై దాడులు నిర్వహించి రూ.50 లక్షల విలువైన 1,033 కేజీల దుంగలు, వాహనాలు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ సుధాకరరెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాలూకా సీఐ బాలయ్య ఆధ్వర్యంలో జీడీనెల్లూరు ఎస్సై సుమన్, ఎన్ఆర్పేట ఎస్సై దిలీప్ కుమార్.. చిత్తూరు-పుత్తూరు మార్గంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న ద్విచక్ర వాహనం, కారును అడ్డుకుని తనిఖీ చేసి తిరుపతికి చెందిన రాజేష్, తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన సుకుమార్, హేమకుమార్ అలియాస్ శశిని అదుపులోకి తీసుకుని విచారించగా కొద్దికాలంగా అక్రమరవాణా చేస్తున్నట్లు తేలింది. ఈ నెల 22న గంగాధర నెల్లూరు మండలంలోని కట్టకిందపల్లిలో వాహనాల తనిఖీ చేస్తుండగా వేగంగా వస్తున్న వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ వాహనం అతివేగంగా వెళ్లడంతో బోల్తా కొట్టింది. ఆ వాహనం నుంచి పారిపోయిన ముగ్గురూ వీరేనని తేలింది.
చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం పట్టివేత
March 26, 2022
0
Tags