మమతా వ్యాఖ్యలకు లోకేశ్ ఖండన
అప్పట్లో చంద్రబాబు ఈ పెగాసస్ స్పైవేర్ నిజంగానే కొనుగోలు చేశారా లేదా అనేది చర్చ జరుగుతోంది. మమత వ్యాఖ్యలపై చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పెగాసస్ కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అప్పట్లో తమకు కూడా పెగాసస్ క్రియేట్ చేసిన వారి నుంచి ఆఫర్ వచ్చిందన్నారు. కానీ తాము దాన్ని తిరస్కరించామని లోకేశ్ స్పష్టం చేశారు. చట్టానికి విరుద్ధంగా తాము ఎలాంటి పనులు చేయమన్నారు. ఆమెకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని అన్నారు. ఆ సమాచారం ఆధారంగానే ఆమె అలా అని ఉండొచ్చని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ నిజంగా పెగాసస్ కొనుగోలు చేసి ఉంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టకుండా ఉంటుందా అని లోకేశ్ ప్రశ్నించారు. ఇజ్రాయెల్కు చెందిన NSO Group అనే సంస్థ ఈ పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్ను క్రియేట్ చేసింది. ఈ స్పైవేర్ ద్వారా వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పెగాసస్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. భారత్లోనూ పెగాసస్ రాజకీయ వివాదాలకు దారితీసింది. పెగాసస్ స్పైవేర్ ద్వారా దేశంలోని 300 మంది ప్రముఖులపై చట్టవ్యతిరేక నిఘా కొనసాగుతోందంటూ కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.