సెన్సెక్స్‌ 2800, నిఫ్టీ 850 పతనం

Telugu Lo Computer
0


రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లన్నీ పతనం దిశగా సాగుతున్నాయి. భారత స్టాక్‌ మార్కెట్లలో (Indian Stock markets) గురువారం మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఏకంగా 5 శాతం వరకు పతనమయ్యాయి. మార్కెట్లు మొదలైన అరగంటలోనే బీఎస్‌ఈ మార్కెట్‌ విలువ రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైంది. రూ.256 లక్షల కోట్ల నుంచి రూ.246 లక్షల కోట్లకు తగ్గింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ ఏడేళ్లలో తొలిసారిగా బ్యారెల్‌కు 103 డాలర్లకు చేరుకుంది. ఇండియా విక్స్‌ 30 శాతానికి పెరిగింది. మార్కెట్లు ఇప్పటికే జీవనకాల గరిష్ఠాల నుంచి పది శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 2800 పాయింట్ల నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16,300 దిగువన ముగిసింది. క్రితం రోజు 57,232 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,418 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో ఆరంభమైంది. దాదాపుగా 1800 పాయింట్ల నష్టంతో మొదలైంది. 55,996 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ చూస్తుండగానే 54,383 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. నిన్నటి ముగింపుతో పోలిస్తే సూచీ ఏకంగా 2850 పాయింట్లు పతనమైంది. చివరికి 2,702 పాయింట్ల నష్టంతో 54,529 వద్ద ముగిసింది. బుధవారం 17,063 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,548 పాయింట్ల వద్ద మొదలైంది. దాదాపుగా 515 పాయింట్ల నష్టంతో ఆరంభమైంది. 16,705 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకున్న సూచీ 16,203 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 860 పాయింట్ల వరకు పతనమైంది. మొత్తంగా 815 పాయింట్ల నష్టంతో 16,247 వద్ద ముగిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)