ఇటీవల బీహార్కు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు ఏకంగా 11 సార్లు టీకా తీసుకుని వార్తల్లో నిలిచారు. ఈ విషయం తెలుసుకున్న కొవిడ్ నియంత్రణ అధికారులు ఆ వ్యక్తిపై చర్యలకు ఉపక్రమించారు. ఇప్పుడు అటువంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది . అదే రాష్ట్రానికి చెందిన ఓ డాక్టర్ ఐదు సార్లు వ్యాక్సిన్ తీసుకున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. కొవిన్ పోర్టల్ వివరాల ప్రకారం బీహార్లోని పట్నాకు చెందిన డాక్టర్ విభా కుమారీ సింగ్ సివిల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె గతేడాది జనవరి 28న తొలి డోసు తీసుకున్నారు. మార్చి నాటికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈనెల 13న ప్రికాషన్ డోసు కూడా తీసుకున్నారు. అయితే ఆమె గతేడాది ఫిబ్రవరి 6న, జూన్ 17న కూడా పాన్ కార్డు వివరాల ఆధారంగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది. దీనిపై పట్నా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభమైందని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలావుండగా డాక్టర్ విభా కుమారి మాట్లాడుతూ, తాను నిబంధనల ప్రకారమే కోవిడ్ వ్యాక్సిన్ను తీసుకున్నానంటున్నారు. ఇప్పటివరకు మూడు సార్లు మాత్రమే టీకా తీసుకున్నానని, తన పాన్ కార్డు వివరాలను ఉపయోగించి ఇతరులెవరో టీకాలు తీసుకున్నారని, దీనిపై దర్యాప్తు జరపాలని కోరారు.
ఐదుసార్లు టీకా తీసుకున్న వైద్యురాలు?
January 19, 2022
0
Tags