ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం రూరల్ మండలం నందమూరి నగర్కు చెందిన నల్లబోతుల రాజేష్ (33), సుజాతకు కొన్నేళ్ల కిందట పెళ్లైంది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. సుందరయ్య కాలనీకి చెందిన గురుమూర్తి, బాలరాజు, రాజేశ్ కు స్నేహితులు. చాలా రోజుల నుంచి మిత్రులుగా ఉన్నారు. ఆ నమ్మకంతోనే.. గురుమూర్తి ఇంటి నిర్మాణ పనుల గురించి రాజేశ్ కు చెప్పాడు. వాళ్లకున్న స్నేహంతో.. గురుమూర్తి ఇంటి నిర్మాణాన్ని.. రాజేశ్ దగ్గరగా ఉండి మరీ చేయించాడు. ఈ క్రమంలోనే.. గురుమూర్తి భార్యతో రాజేశ్ కు పరిచయం ఏర్పడింది. అది కాస్త చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన భార్యతో అలా చేయడం తప్పని, గురుమూర్తి రాజేశ్ ను హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా.. వినకపోవడంతో చంపేయాలని భావించాడు. డిసెంబర్ 17వ తేదీన రాజేశ్ ను ఇంటి నుంచి తీసుకెళ్లారు గురుమూర్తి, బాలరాజు. వివాహేతర సంబంధంపై వారి మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైప చీకటి పడుతున్నా.. భర్త ఇంటికి రాకపోవడంతో సుజాత ఫోన్ చేసింది. తామంతా మందు పార్టీలో ఉన్నామని, త్వరగా ముగించుకుని వస్తానని రాజేష్ తెలిపాడు. ఇక అవే చివరి మాటలు. రాత్రైనా రాజేశ్ ఇంటికి రాలేదు. డిసెంబర్ 18న కామారుపల్లి సమీపంలోని లే అవుట్లో వ్యక్తి చనిపోయి ఉన్నారన్న సమాచారం పోలీసులకు వచ్చింది. ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర గౌడ్, రూరల్ ఎస్ఐ మహానంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మెడపై కొడవలితో నరికినట్లుగా గాయాలున్నాయి. విషయం తెలుసుకున్న సుజాత అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించింది. తన భర్త రాజేష్దేనని ధ్రువీకరించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది!
December 19, 2021
0