అగ్నికి ఆజ్యం పోయద్దు!
November 13, 2021
0
టీ20 ప్రపంచకప్ సెమీస్లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్ ఓటమికి ఆ జట్టు ఆటగాడు హసన్ అలీనే కారణమంటూ పాక్ క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు ఆసీస్ బ్యాటర్ వేడ్ ఇచ్చిన క్యాచ్ను పట్టుకొని ఉంటే.. పాక్ మ్యాచ్ గెలిచేదని, బంతిని వదిలేసి తప్పు చేశాడంటూ అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పాక్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ స్పందిస్తూ హసన్ తప్పేమీ లేదని స్పష్టం చేశాడు. తాజాగా దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ స్పందించారు. ఇప్పటికే పాక్ జట్టు తీవ్ర నిరాశతో ఉందని.. హసన్ను విమర్శిస్తూ అగ్నికి ఆజ్యం పోయొద్దని ప్రజలను కోరారు. ''ప్రస్తుత పరిస్థితి క్రికెటర్లకు, అభిమానులకు కష్టతరమైందే. ఆట ముగియగానే.. నిరాశతో ఆటగాళ్లంతా వారి గదుల్లోకి వెళ్లి బాధపడతారు. ఎవరితోనూ మాట్లాడరు. మ్యాచ్ ఓటమి వారిని వెంటాడుతుంటుంది. అలాంటప్పుడు దేశ ప్రజలమైన మనం.. అగ్నికి ఆజ్యం పోసినట్లు వారిని బాధపెట్టకూడదు. ఇప్పుడు ప్రజలంతా హసన్ అలీని నిందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నేను, వాకర్ యునీస్ ఎదుర్కొన్నాం. ఇతర దేశాల్లో అయితే, ఇది కేవలం ఒక ఆట మాత్రమే. మరుసటి రోజు బాగా ప్రయత్నించారు.. ఇది దురదృష్టకరం అని ఊరుకుంటారు''అని వసీమ్ అక్రమ్ అన్నారు.