బంగాళాఖాతంలో అల్పపీడనం

Telugu Lo Computer
0




బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణితో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రేపు అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు మొదలయ్యాయి. ఆదివారం నుంచి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతం దగ్గరలో దక్షిణ కోస్తాంధ్ర నుంచి ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి వ్యాపించి ఉంది. దీంతోపాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో కూడా మరో ఉపరితల ఆవర్తనం వ్యాపించింది. వీటితోపాటు అల్పపీడన ప్రభావంతో రానున్న నాలుగు రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ జిల్లాల వారీగా హెచ్చరికలు జారీచేసింది. ఈ రోజు, రేపు అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. 10న భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు, కడప, గుంటూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 11న నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేసింది. దీంతోపాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)