ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా డోన్ మండలం వెంకట నాయనపల్లిలో దారుణం జరిగింది. సచివాలయ ఉద్యోగి, మహిళా కానిస్టేబుల్ బాల లక్ష్మి దేవి దారుణ హత్యకు గురైంది. ఆమె భర్త సుధాకర్ ఆమెను హత్య చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. బాల లక్ష్మి దేవి, సుధాకర్ ఇద్దరు ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా సచివాలయ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. పెళ్లయిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. సుధాకర్ అనుమానంతో భార్యను వేధించసాగాడు. అతడి వేధింపులు తట్టుకోలేక దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా అతని తీరు మారకపోవటంతో పెద్దమనుషుల సమక్షంలో విడాకులు కూడా తీసుకున్నారు. దేవిపై కోపం పెంచుకున్న సుధాకర్ మంగళవారం స్కూటీపై వెళుతున్న బాల లక్ష్మీదేవిని అడ్డగించాడు. తర్వాత ఆమె గొంతుకోసి హత్య చేశాడు. గమనించిన స్థానికులు పట్టుకొని బంధించేందుకు ప్రయత్నించినా సుధాకర్ తప్పించుకున్నాడు. డోన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
Post a Comment
0Comments
3/related/default