రిలయెన్స్ లైఫ్ సైన్సెస్ దేశీయంగా తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ తొలిదశ క్లినికల్ పరీక్షలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం అనుమతించింది. ఆరోగ్యవంతుల్లో ఈ టీకా భద్రత, రోగ నిరోధక స్పందనలు ఎలా ఉన్నాయన్నది పరీక్షించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో ఎనిమిది చోట్ల ఈ క్లినికల్ పరీక్షలు చేపడతారు. ముఖేశ్ అంబానీకి చెందిన రిలయెన్స్ లైఫ్ సైన్సెస్ వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు అనుమతి కోరుతూ గతనెల 26న విషయ నిపుణుల సంఘానికి దరఖాస్తు చేసింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు.. టీకాలు అందించిన తర్వాత 14వ రోజున కాకుండా, 42వ రోజున వలంటీర్లలో రోగనిరోధక శక్తి స్థాయులను సమీక్షించాలని తయారీ సంస్థకు సూచించింది.