వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి, మెదడులో తీవ్ర గాయాల కారణంగా టిక్టాక్ స్టార్ ఆంథోనీ బరాజాస్ (19) కన్నుమూశాడు. ఈ విషయాన్ని సౌత్ కాలిఫోర్నియా పోలీసులు తెలియజేశారు. అమెరికాలోని కరోనా థియేటర్ లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఆంథోనీ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
గత నెల 26న దక్షిణ కాలిఫోర్నియాలోని కరోనా థియేటర్లో హారర్ మూవీ “ది ఫరెవర్ పర్జ్” ప్రదర్శిస్తున్న సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సినిమా ముగిసిన తర్వాత, ఆడిటోరియం శుభ్రం చేస్తున్న థియేటర్ ఉద్యోగులు రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరు బాధితులను గుర్తించారు. వారిలో ఒకరు ఆంథోని బరాజాస్, మరొకరు అతడి ఫ్రెండ్. చాలా దగ్గరి నుంచి వారి తలపై కాల్చినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ ఘటనలో ఆంథోనీ ఫ్రెండ్ రైలీ గుడ్రిచ్ స్పాట్ లోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆంథోనీని ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడు జోసెఫ్ జిమెనెజ్ (20)ను అరెస్టు చేశారు. ఆంథోనికి టిక్టాక్లో దాదాపు 10 లక్షల మంది, ఇన్స్టాలో 50 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.