నగదు రహిత లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ-రూపీ అనే కొత్త పేమెంట్ విధానాన్ని రూపొందించింది. ఆగస్టు 2న ఇది దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రధాని మోదీ ఈ యాప్ ను ప్రారంభించనున్నారు. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ పేమెంట్ విధానాలకంటే సరళమైన పద్దతిలో క్యాష్లెస్, కాంటాక్ట్లెస్గా ఉండేలా రూపొందించారు. ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూర్ కోడ్ లేదా ఎస్ఎమ్మెస్ స్ట్రింగ్ వోచర్ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్కి పంపిస్తారు. ప్రస్తుతం డిజిటల్ ప్రెమెంట్స్ యాప్స్ ద్వారా చేస్తున్న విధంగానే ఉంటుంది. కానీ ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉదాహరణకు మెడిసిన్ కొనేందుకు ఈ -రూపీ వోచర్లు తీసుకుంటే ఆ వోచర్లను వాటిని కొనేందుకే వాడాలి. చెల్లింపులు మొత్తం వోచర్ల ద్వారానే జరుగుతాయి. మనం చెల్లించాల్సిన వారికి వోచర్ ఎస్ఎంఎస్ చేయడం.. లేదంటే స్కాన్ చేయడం వంటివి చేయాలి. స్మార్ట్ ఫోన్ లేనివారు వోచర్ కోడ్ ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది.ఈ-ఆర్ యుపీఐ వోచర్లు అనేవి నిర్ధిష్టమైన వాటి కోసం మాత్రమే ఉద్దేశించబడినవి. బ్యాంకు ఖాతా లేదా డిజిటల్ పేమెంట్ యాప్ లేదా స్మార్ట్ ఫోన్ లేకున్నా ఈ వోచర్లను ఉపయోగించుకోవచ్చు. అదే ఇందులోని ప్రధాన తేడా. ఈ వోచర్లు ఎక్కువగా ఆరోగ్య సంబంధిత చెల్లింపుల కోసం ఉపయోగించబడతాయి.
వీటిని రీడీమ్ చేసుకోవడానికి వోచర్ కార్డు లేదా హార్డ్ కాపీ అవసరం లేదు. సందేశంలో వచ్చిన క్యూఆర్ కోడ్ సరిపోతుంది. నేషనల్ హెల్త్ అథారిటీ ప్రకారం, ఇప్పటికే ఎనిమిది బ్యాంకులు ఈ-ఆర్ యుపీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండస్ సిండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి.