భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సావాన్ని ఘనంగా జరుపుకొన్న సందర్భంగా భారతీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వివిధ రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజలను రద్దు చేసింది. దీంతోపాటు వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. గృహ రుణాలపై పరిమిత కాలపు ఆఫర్ కింద 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ గతంలోనే ప్రకటించింది. తాజాగా కారు రుణాలను కూడా 100 శాతం ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా అందిస్తోంది. 2022 జనవరి 1 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. అంతేకాకుండా వినియోగదారులు కారు ఆన్-రోడ్ ధరపై 90 శాతం వరకు రుణాల పొందే సదుపాయాన్ని కల్పిస్తోంది. యోనో యాప్ ద్వారా కారు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి 25 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) మేర వడ్డీ రాయితీ ఆఫర్ చేస్తోంది. యోనో యాప్ వినియోగదారులు కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే 7.5 శాతం అతి తక్కువ వార్షిక వడ్డీతో రుణం తీసుకోవచ్చు. బంగారంపై రుణాలను తీసుకునే వారికి కూడా 75 బేసిస్ పాయింట్లు మేర వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఖాతాదారులు ఏ ఛానల్ ద్వారా (ఆన్లైన్, ఆఫ్లైన్, యోనో యాప్) అయినా 7.5 శాతం వార్షిక వడ్డీతో బంగారంపై రుణం పొందొచ్చు. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయబోమని తెలిపింది. ఎస్బీఐ వ్యక్తిగత, పెన్షన్ లోన్ వినియోగదారులు ఏ ఛానల్ ద్వారా రుణం తీసుకున్నప్పటికీ 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. వ్యక్తిగత రుణ కోసం దరఖాస్తు చేసుకున్న కొవిడ్ వారియర్స్ (ఫ్రంట్లైన్ హెల్త్కేర్ వర్కర్స్)కు 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీని ఇస్తున్నట్లు తెలిపింది. దీన్ని త్వరలోనే కారు, బంగారు రుణాలకు దరఖాస్తుదారులకూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
ఎస్బీఐ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు రద్దు
August 16, 2021
0