పెగాసెస్ ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతున్న పేరు. చాలా మందికి ఇదేంటో అర్ధం కాలేదు. ఇదేదో బిజెపి, కాంగ్రెస్ కొట్టుకోవడానికి వచ్చిన కొత్త సబ్జెక్ట్ అనుకుంటున్నారు.
ఈ పెగాసెస్ వివాదం ఎంత పెద్దదో.. అది ఎంత ప్రమాదమో అనేది ఇంకా తెలియటం లేదు. ఐటి, సాఫ్ట్ వేర్ విషయాలు తెలియని వాళ్లు దీనిని చాలా లైట్ తీసుకుంటున్నారు. కాని అసలు పెగాసెస్ ఏంటి? మన దేశంతో దాని లింకేంటి? ఇక్కడ ఏం జరిగిందని ఇప్పుడు గొడవ జరుగుతుంది? అన్ని విషయాలు మనతో సవివరంగా పంచుకున్నారు ఐటీ నిపుణులు, ఆలిండియా జనరల్ సెక్రటరీ, ఫ్రీ సాఫ్ట్ వేర్ మూమెంట్ ఆఫ్ ఇండియా వై.కిరణ్ చంద్ర.
ప్రశ్న : అసలేంటీ పెగాసెస్? ఎవరు తయారు చేశారు? అంత పవర్ ఫుల్ అది? ప్రపంచ దేశాలు ఎగబడి కొనుక్కునేంత ఏముంది దాంట్లో?
జవాబు : ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్ లిమిటెడ్ (%చీఱఙ, ూష్ట్రaశ్రీవఙ aఅస ఉఎతీఱ%.. ఈ సంస్థ వ్యవస్ధాపకుల పేర్లు. వారి పేరు మీదే కంపెనీ ఉంది) ఈ పెగాసెస్ అనే సాఫ్ట్ వేర్ని డెవలప్ చేసింది. అమెరికా, ఇతర దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో వీరికి గట్టి సంబంధాలే ఉన్నాయి. సైబర్ వెపన్స్ చేయడంలో తాము ఎక్స్పర్ట్స్ వారి వెబ్సైట్లో చెప్పుకుంటారు. ఇంటర్నెట్ వేదికగా సైబర్ వెపన్స్ ప్రయోగించడమే వీళ్ల పని.
వీరు తయారు చేసిన పెగాసెస్ అనే సైబర్ వెపన్ ప్రభుత్వాలకు, ప్రభుత్వ సంస్థలకు అమ్ముతున్నారు. ఇది ఎవరి మొబైల్లోకి అయినా.. ఎవరి కంప్యూటర్లోకి అయినా యూజర్కి తెలియకుండానే ఎంటరైపోతుంది. మొన్నటివరకు ఏదో లింక్ క్లిక్ చేస్తేనే వస్తుందన్నారు. అసలు విషయం ఏంటంటే లింక్ కూడా అవసరం లేదు. ఇంటర్ నెట్తో కనెక్ట్ అయితే చాలు.. అది మన ఇంట్లోకి వచ్చినంత ఈజీగా వచ్చేస్తుంది. వచ్చాక మన ఫోటోలు, మన డేటా, మన మెయిల్స్, మన చాటింగ్ అన్నీ తెలుసుకుంటుంది.
ఆఖరికి మనం కీవర్డ్స్ ద్వారా పంపుకునే కమ్యూనికేషన్స్ కూడా డీకోడ్ చేసేసుకుంటుంది. మనం చేసే యాక్టివిటీ మొత్తం వారికి తెలిసిపోతుంది. లేటెస్టుగా యూరప్కు చెందిన ఓ సంస్థ మరికొందరు ఈ పెగాసెస్ ద్వారా 50 వేల మంది ఫోన్లను హ్యాక్ చేశారని.. అందులో 300 నెంబర్లు ఇండియావారివేనని.. అందులో రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్, ఇంకా న్యాయమూర్తులు చాలామంది ఉన్నారని కథనాలు వచ్చాయి. ది వైర్ వెబ్ సైట్ ఈ సంచలన కథనాన్ని ప్రచురించింది. దీంతో పార్లమెంటులో దీనిపై బిజెపి, ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తోంది. ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ జరగలేదని చెబుతోంది.
ప్రశ్న : ఎన్ఎస్ఓ గ్రూప్ తాము ఈ పెగాసెస్ను కేవలం ప్రభుత్వాలకు, ప్రభుత్వ సంస్ధలకు మాత్రమే అమ్ముతామని చెబుతోంది? నిజమేనా? భారత ప్రభుత్వం దీనిని కొనుగోలు చేసిందా?
జవాబు : ఆ సంస్థ చెబుతున్నది అదే. ప్రభుత్వాలకు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే ఇస్తానంటోంది. అంతేకాదు అధికారికంగా వారొక కండిషన్ కూడా పెట్టారు. దీనిని కేవలం ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి మాత్రమే వాడాలని. కాని మన దేశంలో ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ప్రభుత్వం మీద విమర్శలు చేసేవారి మీద ప్రయోగించారని ఆరోపణలు గట్టిగా వినపడుతున్నాయి. కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా నడుస్తున్న యాక్టివిటీస్, వ్యూహాలను తెలుసుకుని, ప్రభుత్వ వ్యతిరేకత పెరగకుండా ఉండేలా దీనిని వాడుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.
పది నుంచి 50 ఫోన్ల వరకు హ్యాక్ చేయడానికి అవసరమైన సాఫ్ట్వేర్ను కేవలం 60 కోట్ల రూపాయలతో వచ్చేస్తుంది. కేంద్ర మంత్రులు పార్లమెంట్లో సమాధానం చెప్పేటప్పుడు కొనలేదని చెప్పలేదు.. కొన్నామనీ చెప్పలేదు. ఏదైనా కొనే హక్కు ఉందని మాత్రం చెప్పారు. దీనిపై ఏ సమాచారం అడిగినా భద్రతా కారణాల రీత్యా చెప్పలేమంటారు. కాని వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత ప్రమాదంలో పడ్డాయని మాత్రం కచ్చితంగా మనం అనుకోవచ్చు.
ప్రశ్న : రెండేళ్ల క్రితమే పార్లమెంట్లో ఫోన్ ట్యాపింగ్పై చర్చ జరిగింది. అప్పుడు కూడా అధికార బిజెపి ట్యాపింగ్ చేయలేదని చెప్పింది గానీ.. పెగాసెస్ తీసుకోలేదని మాత్రం చెప్పలేదు.. ఏంటి దానర్ధం?
జవాబు : ట్యాపింగ్ వేరు.. హ్యాకింగ్ వేరు. ఫోన్ ట్యాప్ చేస్తే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే అంశాల వరకు మాత్రమే తెలుస్తాయి. పెగాసెస్ సంగతి వేరు. దీని ద్వారా హ్యాక్ చేస్తే.. మొత్తం సమాచారమే వారికి వెళ్లిపోతుంది. నేను తెరిచిన పుస్తకం అంటారు కదా జనరల్గా.. ఇక్కడ పెగాసెస్ ఎంటరైతే మన జీవితం చించిన పుస్తకం అయిపోతుంది. ఎందుకంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం..
ఎవరికి మెయిల్ చేస్తున్నాం.. ఏ వీడియోలు చూస్తున్నాం.. ఏ న్యూస్ ఎక్కువగా ఫాలో అవుతున్నాం.. ఫేస్బుక్లో ఎలాంటి కామెంట్స్ పెడుతున్నాం.. మొత్తం మన ఆలోచనా ధోరణిని ట్రాక్ చేసేస్తారు. ప్రభుత్వం ఏమీ చెప్పటం లేదు. కాని ఇప్పుడు ఆ లిస్టులో నెంబర్లున్నవారు తమ మొబైల్స్ చెక్ చేయించుకుంటే పెగాసెస్ ఎంటరైందీ లేనిదీ తెలిసిపోతుంది. అప్పుడు నిజం ఎవరూ దాయలేరు.
ప్రశ్న : 2019 ఎన్నికల టైమ్ లో బిజెపి పెగాసెస్ను వాడుకుందనే ఆరోపణల్లో నిజమెంత?
జవాబు : బిజెపికి ఫేస్బుక్తో ఉన్న అసోసియేషన్పై ఎంక్వయిరీ చేసిన, బిజెపిని ఎన్నికల నిబంధనల విషయంలో ప్రశ్నించిన ఎన్నికల కమిషన్ అధికారులు, సోషల్ వర్కర్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు. బిజెపి అప్పటికి అధికారంలో ఉంది కాబట్టి.. పెగాసెస్ కొని ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. అయితే రాజకీయ పార్టీగా బిజెపి వాడుకున్నదనే దానిపై ఇప్పటికైతే ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ వాడుకుని ఉంటే.. అది ఇప్పుడు కచ్చితంగా బయటపడుతుంది.
ప్రశ్న : టెక్నికల్గా పెగాసెస్ను ఎదుర్కోలేమా?
జవాబు : ఇది ఒక విధంగా జరుగుతున్న దొంగతనాన్ని ఆపడం లాంటిదే. పెగాసెస్ సాఫ్ట్ వేర్ యూఎస్ మొబైల్ నంబర్ల మీద పని చేయదు. +1 సిరీస్తో ప్రారంభమయ్యే అమెరికా నెంబర్లను ఈ సాఫ్ట్వేర్ హ్యాక్ చేయలేదు. ఎందుకంటే అమెరికాలో వ్యక్తిగత గోప్యతా హక్కులకు సంబంధించిన చట్టాలు అంత బలంగా ఉంటాయి. మనకు అలాంటి చట్టాలు లేవు. గతంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ మంచి సిఫార్సులు చేసినా వాటిని పట్టించుకోలేదు.
పార్లమెంట్లో ఇప్పటివరకు పెట్టిన, పెట్టబోతున్న బిల్లులు ఏమీ పనికిరావు. 66ఎ లాగానే ఉంటాయి.. సుప్రీంకోర్టు వద్దన్నా ఆ సెక్షన్ కింద కేసులు పెట్టినట్లే ఉంటుంది వాటితో వ్యవహారం. పెగాసెస్ లాంటి సాఫ్ట్వేర్లను అమెరికన్ ఏజెన్సీలు ఎన్ఎస్ఏ, సీఐఏలు 5వేలకు పైగా తయారు చేశాయని వికీలీక్స్లో బయటపెట్టారు. అంటే మన డేటా ప్రొటెక్షన్లా ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అర్ధం చేసుకోండి.