నీతి కథ...!!

Telugu Lo Computer
0


జీవితంలో సమస్యలు చుట్టుముడితే ఏమి చెయ్యాలో చాణుక్యుడు చెప్పిన అద్భుతమైన నీతి కథ...!!

 తక్షశిల విశ్వవిద్యాలయం పురాతన భారతదేశపు అత్యున్నత విద్యాలయాలలో ఒకటి. ఇందులో చదివినవాళ్ళు దేశంలోనే గొప్ప రాజులుగా ప్రసిద్ధిగాంచారు. చాణుక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యను బోధించేవారు.. ఈ నేపథ్యంలో తన విద్యార్థులకు ఒక నీతి కథను చెప్పాడు.. ఒక అడవి లో ఒక లేడి(జింక) భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది. అది నిండు గర్భిణి, దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి. అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది. ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది . దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది. అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది. నొప్పులు మొదలయ్యాయి. నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది.  అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి. ఉరుములు, పిడుగులు. పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం వస్తోంది. ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు. భగవాన్ ! ఆ లేడి ఇప్పుడు ఏమి చెయ్యాలి ? ఏమి జరగబోతోంది ? లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా ? బిడ్డ బతుకుతుందా? సింహం లేడిని తినేస్తుందా? వేటగాడు లేడిని చంపెస్తాడా ? నిప్పు లేడి వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా?

ఒక వైపు నిప్పు, రెండో వైపు నది, మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపంలో వేటగాడు, సింహం. కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. తన ప్రాణం పోతుందా లేదా అని ఆలోచించలేదు.. లేడి తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది. వర్షం తో పాటు పిడుగు పడింది.. ఆ పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి. బాణం గురి తప్పింది.. అది వెళ్లి సింహానికి తగిలింది. వర్షం పడి అడవిలో రాజుకున్న మంటలు ఆరిపోయాయి. అదే సమయంలో లేడి పిల్ల తల్లి గర్భం లో నుండి బయటకు వచ్చింది. అది ఆరోగ్యంగా ఉంది. అదే లేడి తన ప్రాణం గురించి అలోచించి ఉండి, బిడ్డకు జన్మనివ్వడం పై దృష్టి పెట్టకుండా ఉండి ఉంటే, లేడి తప్పటడుగు వేసి ఉండేది. అప్పుడు ఏమి జరిగేది.. ఆలోచించండి. మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే ఉంటాయి . నెగటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాం. అప్ప్పుడు మన కర్తవ్యాన్ని విస్మరించి.. ఏవో ఆలోచిస్తాం.. అలాకాకుండా భగవంతుడిపై భారం వేసి మన పని మనం చేస్తుంటే.. ఖచ్చితంగా సమస్యలనుంచి బయటపడతాం.

Post a Comment

0Comments

Post a Comment (0)