నైరుతి రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించాయి. రుతుపవనాలు కేరళ దక్షిణ తీర ప్రాంతాన్ని తాకినట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. వాస్తవానికి జూన్ 1 నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు మారడంతో రెండు రోజులు ఆలస్యంగా వచ్చాయి. వీటి ప్రభావంతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఈసారి సాధారణం లేదా సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
మన దేశం వ్యవసాయ రంగం వర్షాలపైనే ఆధారపడి ఉంది. సగానికి పైగా భూములను వర్షా కాలంలోనే సాగు చేస్తారు. ప్రధానంగా ఈ నైరుతి రుతవపనాల మీద ఆధారపడే పంటలను పండిస్తారు. నైరుతి రుతుపవనాలు వచ్చిన తర్వాత నాలుగు నెలల పాటు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి జూన్ 12న వచ్చే అవకాశముంది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన తర్వాత మన దేశంలో వర్షాకాలం పంటల సాగు ఊపందుకుంటుంది.