కరోనాతో చనిపోయిన తమ ఉద్యోగులను ఆదుకోవడానికి ఒక్కొక్క కంపెనీ ముందడుగు వేస్తున్నాయి. ఇంతకుముంది టాటా స్టీల్ తమ ఉద్యోగులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు అదే బాటలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగుల కోసం ఒక ప్రకటన చేసింది. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఐదేళ్లపాటు రిలయన్స్ కంపెనీ ప్రతీనెల జీతం చెల్లిస్తుంది. దీనితో పాటు బాధితుల కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం కూడా సంస్థ అందించనుంది. మరణించిన ఉద్యోగుల పిల్లల విద్యకు సంబంధించిన ఖర్చును కూడా రిలయన్స్ భరిస్తుంది. కరోనాతో మరణించిన ఉద్యోగుల పిల్లల కోసం భారతదేశంలోని ఏ ఇనిస్టిట్యూట్లోనైనా 100% ట్యూషన్ ఫీజు, హాస్టల్ వసతి మరియు గ్రాడ్యుయేషన్ డిగ్రీ వరకు పూర్తి డబ్బులను రిలయన్స్ అందిస్తుంది.
పిల్లల గ్రాడ్యుయేట్ వరకు జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు మరియు పిల్లలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆసుపత్రిలో చేరడానికి 100శాతం ప్రీమియంను రిలయన్స్ భరిస్తుంది. ఇదే కాకుండా, కరోనా సోకిన ఉద్యోగులు లేదా వారి కుటుంబంలో ఎవరికైనా కరోనా ఉంటే.. వారు శారీరకంగా మరియు మానసికంగా కోలుకునేవరకు కోవిడ్ -19 సెలవు ఇస్తుంది.