కరోనా సంక్షోభ సమయంలో మరణించిన వారి ఆస్థికలు నిమజ్జనం చేయడానికి ఒక సేవా సంస్థతో కలిసి పోస్టల్ శాఖ ఒక నూతన విధానాన్ని ప్రవేశ పెట్టింది. స్పీడ్ పోస్ట్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా అస్తికలు పంపితే, వారణాసి, ప్రయాగ్రాజ్, హరిద్వార్, గయలోని గంగానదిలో కలిపేందుకు ఏర్పాట్లు చేసింది. వారణాసిలోని ఓమ్ దివ్య దర్శన్ అనే సామాజిక సేవాసంస్థతో కలిసి సంయుక్తంగా స్పీడ్ పోస్ట్ విధానాన్ని ప్రారంభించింది.
దేశంలో ఎక్కడి నుంచైనా అస్థికలను స్పీడ్ పోస్ట్ ద్వారా ఓమ్ దివ్య దర్శన్ కార్యాలయానికి పంపించవచ్చు. వీటిని ఎన్జీఓ సిబ్బంది.. వారణాసి, ప్రయాగ్రాజ్, హరిద్వార్, గయాలో నిమజ్జనం చేస్తారు. అయితే స్పీడ్ పోస్ట్ చేసేవారు ముందుగా ఓమ్ దివ్య దర్శన్ పోర్టల్లో పేరు నమోదు చేసుకోవాలని వారణాసి పోస్ట్మాస్టర్ జనరల్ కృష్ణ కుమార్ యాదవ్ తెలిపారు.
శాస్త్రోక్తంగా.. ఓమ్ దివ్య దర్శన్ సేవాసంస్థ సభ్యులు అస్థికలు నిమజ్జనం చేస్తారని కృష్ణకుమార్ యాదవ్ వివరించారు. ఈ కార్యక్రమం తర్వాత ఒక సీసాలో గంగానది నీటిని ఆయా కుటుంబ సభ్యులకు పోస్ట్ ద్వారా పంపిస్తారని ఆయన వెల్లడించారు.