ఈనెల 21 నుండి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తానని ప్రకటించిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక ప్రకటన చేసింది. 25 కోట్ల కోవిషీల్డ్ డోసులకు, 19 కోట్ల కోవాగ్జిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చినట్టు నీతీ అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ నేడు జరిగిన పత్రికా సమావేశంలో ప్రకటించారు. సీరం ఇన్స్టిట్యూల్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలకు టీకాల కోసం ఆర్డర్ ఇచ్చినట్టు ఆయన పత్రికాసమావేశంలో ప్రకటించారు. ఇప్పటికే కుదుర్చుకున్న టీకా కొనుగోలు ఒప్పందాలకు ఇది అదనమని ఆయన తెలిపారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ కలిపి మొత్తం 44 కోట్ల కరోనా టీకా డోసులు డిసెంబర్ నాటి కల్లా విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి. టీకా సేకరణ కోసం సీరం, భారత్ బయోటెక్కు అదనంగా 30 శాతం అడ్వాన్స్గా విడుదల చేశామని డా.పాల్ తెలిపారు.
బయాలాజికల్ ఈవాన్స్(బీఈ) సంస్థ తయారు చేస్తున్నకార్బివాక్స్ టీకాను కోనుగోలు చేస్తామని, ఇప్పటికే 30 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. ‘‘బయోలాజిక్ ఈవాన్స్ తమ టీకా ధరను ప్రకటించేందుకు ఎదురు చూస్తున్నాం. కంపెనీతో జరుగుతున్న చర్చలపై ఈ ధర ఆధారపడుతుంది. కేంద్రం ఇప్పటివరకూ చేసిన ఆర్థిక సాయాన్ని టీకా కొనుగోలు ఖర్చుల కింద సర్దుబాటు చేస్తాం’’ అని డాక్టర్ పాల్ తెలిపారు.