ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్కు బదులుగా ఈఏపీసెట్ నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నోటిఫికేషన్ ను ఈనెల 24న విడుదల చేస్తామని, 26 నుంఢి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడించారు. జులై 25 వరకు స్వీకరణ ఉంటుందన్నారు. ఆగస్టు 19 నుండి 25 వరకు పరీక్షలు నిర్వహిస్తామని విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ సీట్లు అని అర్థవచ్చేలా ఎంసెట్ (ఈఏఎంసెట్) అనే పేరు చాలా ఏళ్ల కిందటే పెట్టారు. అయితే కొన్నేళ్ల క్రితం మెడికల్, డెంటల్ సీట్లు జాతీయ స్థాయిలో నీట్ పరిధిలోకి వెళ్లాయి. ఎంసెట్ పేరులో మెడికల్ ఉన్నప్పటికీ మెడికల్ సీట్ల కేటాయింపునకు, ఎంసెట్ పరీక్షకు సంబంధం లేకుండా పోయింది. దీంతో ఎంసెట్ పేరు మార్చాలని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ తాజాగా ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆ పరీక్షలో మిగిలిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల పేర్లను సూచించేలా ఈఏపీసెట్గా మార్చాలని అభిప్రాయపడింది. ఆ ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం ఆమోదించింది. గతంలో ఎంసెట్ పరీక్షపై ఇచ్చిన జీవోలోని మెడికల్, డెంటల్ అనే పదాలను తొలగించింది. ఎంసెట్ ఇక ఈఏపీసెట్గా మారుతుందని తెలిపింది.