తెనాలికి పదిమైళ్ళ దూరంలో వున్న యలవర్రులో జన్మించి, పొలంగట్ల మీదుగా, కాలవగట్లపై కాలినడకన ఐదుమైళ్ళ దూరానవున్న తురుమెళ్ళ వెళ్ళి కారొనేషన్ స్కూల్లో చదువుకుని, పై చదువులకై కాశీ వెళ్ళి, జాతీయ భావాలను పుణికిపుచ్చుకుని ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో డిగ్రీతో, లా చదువుదామని మద్రాసు వచ్చి, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీలో 17 రూపాయల జీతగాడిగా చేరి, తన ప్రతిభను గుర్తించిన ఆ సంస్థ ద్వారానే లండన్, అమెరికాలకు వెళ్ళి పెద్ద చదువులు చదువుకుని, లెదర్ టెక్నాలజీలో పరిశోధకునిగా దేశానికి తిరిగివచ్చి, అతి పిన్నవయసులోనే ఆ రోజుల్లో పండిట్ నెహ్రూ నిర్మిస్తున్న 'మోడరన్ టెంపుల్స్'లో ఒకటైన 'సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కు డైరెక్టర్ గా నియమితులై, తను ఎంచుకున్న వృత్తిధర్మదీక్షతో, విశేష విజ్ఞతతో, ఋషిత్వం సిద్ధించిన శాస్త్రవేత్తగా ఎదిగి, “తోళ్ళ పరిశ్రమలో తరతరాలుగా ఉపయోగిస్తున్న పద్ధతులలో శాస్త్రీయతను ప్రవేశపెట్టి చర్మకారుల దృక్పథానికి ఆధునికతను జోడించి”చర్మపరిశ్రమ క్షేత్రంలో శాస్త్రయుగ చైతన్యాన్ని ఆవిష్కరించిన ఘన శాస్త్రవేత్తగా గుర్తింపుపొంది, అనతికాలంలోనే ముప్పయివేలమంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్న నలభై ఎనిమిది జాతీయ పరిశోధనాశాలల పురోగతిని తీర్చిదిద్దే 'కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్' (CSIR) అనే సంస్థకి డైరెక్టర్ జనరల్ గా ఎదిగిన 'కృషీవలుడే' ఈ నిరాడంబరజీవి!ఆయనే తెలుగుజాతి యావత్తూ గర్వించదగిన శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ.
Post a Comment
0Comments
3/related/default