దాంపత్యం అంటే.....!

Telugu Lo Computer
0

 


దాంపత్యం ఒక శాశ్వతబంధం. కానీ ఆ బంధంలో చాలాచోట్ల పగుళ్ళు కనిపిస్తున్నాయి ఈనాడు. భార్యతో భర్త, భర్తతో భార్య సర్దుకుపోలేని పరిస్థితులు ఎక్కువౌతున్నాయి. ఇటీవల కోర్టుల్లో అత్యధికంగా వస్తున్నవి విడాకుల కేసులే.

ప్రేమించి, పెళ్లి చేసుకుంటే బంధం పటిష్టంగా వుంటుందనే భావన ఉంది చాలామందిలో. ఇంకా సహజీవనం చేస్తే నచ్చకపోతే విడిపోవచ్చు, కోర్టుకు వెళ్లే పని తప్పుతుంది అనే ధోరణి కూడా ఉంది. సినిమాల ప్రభావం కావొచ్చు. పరిసరాల ప్రభావం కావొచ్చు. కానీ ప్రేమించి పెళ్ళాడిన వారు కూడా అనతికాలంలోనే విడాకులకోసం ముందుకు వస్తున్నారు. ఇక సహజీవనం చేసి విడిపోవడం అనేది పశు సంస్కృతికి నిదర్శనం అనలేమో. కొన్నాళ్ళు కోరిక ఉన్నన్ని రోజులు కలిసి తిరిగిన జంతువులు తర్వాత విడిగా దేనికి కావాల్సిన మరో పశువును వెదుక్కుంటూ పోతాయి కదా!
పటిష్టంగా ఉండవలసిన భార్యాభర్తల బంధంలో ఈ చీలిక ఏమిటి? ప్రధానంగా ఈ బంధం గొప్పతనం తెలియక పోవడమే దీనికి కారణం. పెళ్లి పైన తేలికభావం కూడా కావొచ్చు.
ఒకరిలో ఒకరికి నచ్చనివి ఉండడం సహజమే. అన్నివిధాలా ఏ వ్యక్తీ మరొక వ్యక్తిని తృప్తిపరచలేడు. ఒకచోట పెరిగిన వ్యక్తుల మనస్తత్వం ఒకేలా ఉండాలని లేదు. అటువంటిది రెండు వేరు వేరు కుటుంబాల్లో పెరిగిన వాళ్ళ మధ్య తేడా తప్పకుండా ఉంటుంది. కానీ ’ప్రేమ’ అనే మౌలికాంశం ఉన్నప్పుడు క్షమ, సర్దుబాటు ఉంటాయి. ఒకరు కొన్నింటిలో రాజీపడితే, ఇంకొకరు మరికొన్నిటిలో రాజీ పడాలి. జీవితమే ఒక రాజీ.
మనకున్న శరీరంతో దానికి వచ్చే రుగ్మతలతో మనం రాజీ పడుతున్నట్లే, చేస్తున్న ఉద్యోగాల్లో రాజీ పడుతున్నట్టే ముఖ్యమైన మానవ సంబంధాలతోనూ రాజీ పడాలి. ఒక ఆవేశం, ఒక అసహనం, ఇగో ఫీలింగ్ బలమైన అనుబంధాల్ని తెంచకూడదు.
కలిసిరాని కాలం, పరిస్థితులు ఎలా ఉన్నా ’ప్రేమ’తో ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒక్కొక్క సమయంలో ఒక్కోసారి ఒకరు క్షమాగుణం పాటించినప్పుడు ఆ అనుబంధం నిలుస్తుంది.చక్కని కుటుంబవ్యవస్థ కలిగిన గొప్ప దేశం మనది. దానికి మూలం దాంపత్య ధర్మమే.
పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు అంటూ దాంపత్య ధర్మాన్ని దేవతా స్థానంలో ఉంచి ఆరాధించే సంప్రదాయం మనది. ఆ దేవదంపతులకు అనేకమార్లు కళ్యాణాలు చేస్తూ - ఆ ఉత్సవాల ద్వారా వివాహవ్యస్థలోని పవిత్రతనీ, దాంపత్యంలోని శాశ్వతత్వాన్నీ గుర్తు చేసుకుంటాం.
తీవ్రమైన అసహనం,తమ కుటుంబం, పిల్లల భవితవ్యం గురించి ఆలోచించలేకపోవడం వల్ల ఈ విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి.
కాస్త సహనం కలిగి ఉంటే శాశ్వతమైన ఒక బంధం నిలబడుతుంది. భర్త ఎలా ఉన్నా సహించే పతివ్రతల కథలు మనకి కొన్ని పురాణాల్లో కనిపిస్తాయి. కానీ ఆ కథల అసలు సందేశం భర్తలు దుర్మార్గంగా ఉండాలని చాటడం కాదు. ఒకరు అలా వున్నా ఎదుటివారు సహనంతో తమ బంధాన్ని నిలిపి, తమ త్యాగంలోని దివ్యత్వాన్ని కీర్తించడమే వాటి పరమార్థం.
’స్త్రీని నోటితో గానీ, చేతితో గానీ హింసించరాదు’ - అని వైదిక సంస్కృతి చాటుతోంది. విజ్ఞానంలో, గృహనిర్వహణలో స్త్రీ మహారాణి. ఇంటి సంపద ఆమె చేతులపైననే వినియోగింపబడాలని శాస్త్రం చెబుతోంది.’సామ్రాజ్ఞీభవ’ అంటూ వివాహక్రియలో వరుడు, వధువును మంత్రపూర్వకంగా జీవితంలోకి ఆహ్వానిస్తాడు. ఇరువురూ కలిసి మంచి స్నేహితులుగా మసలాలి అని వేదం బోధిస్తోంది.
సప్తపది - సఖ్యానికి సంకేతం.
’సఖా సప్తప దా భవ’
ఏడడుగులతో స్నేహాన్ని సాధించి, దేవతల సాక్షిగా చివరివరకు -”ప్రాణం, శరీరం’ లా కలిసి ఉండాలి అనే ఆకాంక్ష ఆ పెళ్ళి మంత్రాలలో కనిపిస్తుంది.
స్నేహంలో క్షమించడం, రక్షించడం, ప్రేమించడం, పాలుపంచుకొనడంలో ప్రధానాంశాలు. అవన్నీ భార్యాభర్తల బంధంలో ఉండాలి.
భర్త అల్పాయుష్కుడని తెలిసినా అతడిని అంటిపెట్టుకొని, తన తపశ్శక్తితో కాలాన్నే శాసించి, తన పతిని బ్రతికించుకున్న సతీ సావిత్రిలోని ధైర్యం స్త్రీ ఔన్నత్యానికి ప్రతీక. ప్రతికూల పరిస్థితుల్ని చాకచక్యంగా సానుకూల పరచుకోవడమే ఘనత కానీ, పరిత్యజించడం శ్రేయస్సు కాదు.
నల దమయంతుల చరిత్ర, ఇతిహాసంలో ఒక మణిపూస, దాంపత్యంలోని విలువని చాటే అద్భుత వృత్తం. కాలం కలిసిరాని పరిస్థితి జీవితంలో ఒక్కొక్క దశలో ఎవరికైనా తప్పనిసరి. ఆ సమయంలోనే ఉద్రేకాలకు లోనుకాకుండా, ప్రశాంత చిత్తంతో, చాతుర్యంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించే సంయమనం ప్రదర్శించాలి.
ద్యూతంలో తన భర్త ఓడిపోయాక, పిల్లల్ని తన పుట్టింటి రక్షణలో ఉంచినప్పటికీ, తాను మాత్రం పతికి తోడుగా అడవులకు వెళ్ళింది. దమయంతి. కానీ తనతో పాటు ఆమె అగచాట్లు పడడం ఇష్టం లేని నలుడు, అడవిలో ఆమెను విడిచి వెళ్ళాడు. తాను కనపడకపోయేసరికి ఆమే విధిలేక పుట్టింటికి వెళ్ళి రక్షణ పొందుతుందని అతడి ఊహ.
తన భర్త బుద్ధిని ఏదో అదృశ్య శక్తి (కలిపురుషుడు) శాసిస్తోందని గ్రహించిన దమయంతి, అనేక అవరోధాల నెదుర్కొని తన పుట్టినింటికి చేరుకుంది. కానీ అక్కడ ఉంటూనే తెలివిగా ఆమె నలుని జాడను తెలుసుకొని అతడిని తిరిగి చేపట్టింది. ఇక్కడ దమయంతి ఘనతనే పురాణకర్త శ్లాఘించారు. ఓర్పు, సర్దుబాటు ఎప్పటికైనా గెలుస్తాయి.
సృష్టిలో ’అవసరం’ అనిపించిన వాటికోసం ఎన్నో సర్దుబాట్లు, సహనాలు, రాజీపడడాలు ప్రతివ్యక్తి జీవితంలోనూ మామూలే. ఆ అంశాలే వివాహ బంధంలో కూడా అమలుపరిస్తే సుఖసంతోషాలు సహజంగా లభిస్తాయి.
భార్యాభర్తల బంధం ధనంకంటే గొప్పది. కేవలం ఆర్థికవసరాల వల్లనే కలిసి ఉండడం, ఆర్థిక స్వాతంత్ర్యం వలన విడిపోవడం అనే తేలికపాటితనం దాంపత్య బాంధవ్యంలో తగదు.
కడదాకా మిగిలే కమ్మని బంధం ఇది ఒక్కటే. రెక్కలు వచ్చి పిల్లలు ఎగిరివెళ్ళిపోయినా, పండుటాకులై ఒకరికొకరు మిగిలేది దంపతులే. ఒడుదుడుకుల్లో తోడై, బ్రతుకు పయనంలో ప్రయాణించి అలసి, పడమటి సంధ్యారాగంలో జంట స్వరాలుగా మిగిలే శాశ్వతమైన సాహచర్యం ఇది.
నిగ్రహం, నిబద్ధత దాంపత్యంలో ప్రధాన సూత్రాలు. ఆరోగ్యవంతమైన ఒక వ్యవస్థను సంయమనంతో కాపాడుకోవలసిందే.
భారతీయ దృక్పథంలో సతీపతుల బంధం ఇహలోక, పరలోకాలకు, జన్మజన్మలకు కొనసాగుతుంది.
దంపతుల స్థిరత్వం కుటుంబానికి పునాది. మన కుటుంబాలు, మన సమాజానికి ఆలంబనలు.
అభిప్రాయ భేదాలో, అభిరుచుల తేడాలో ఉండవచ్చు. ఆ మాటకొస్తే, ఒక వ్యక్తికి తానే తనకు సరిపడని సందర్భాలు ఎన్నో ఎదురౌతాయి. అప్పుడు తనను తాను క్షమించుకుంటాడు. తనలో తాను సర్దుకుపోతాడు. అలాగే తన జీవిత భాగస్వామితో సర్దుకుపోగలగాలి.
’అనన్యా హి మయా సీతా భాస్కరస్య ప్రభాయథా’అని శ్రీరాముడు సీత గురించి చెప్పినమాట. సూర్యునికి వెలుగువలె సీత నా నుండి విడిబడనిది. ఇంతకంటే దంపతుల ప్రేమకు గొప్ప నిర్వచనం మరొకచోట కానరాదు.
సూర్యునీ, సూర్య కాంతినీ ఎలా విడదీయలేమో అలాగే సీతారాముల్ని వేరుచేయలేం. అలాగే భార్యాభర్తలను కూడా. అందుకే వారి మధ్యలోనుంచి వెళ్లకూడదు అంటారు పెద్దలు.
పురాణేతిహాసాలలొ అత్రిమహర్షి అనసూయలు, అరుంధతీ వసిష్ఠ మహర్షులు, లోపాముద్ర అగస్త్యులు వంటి ఆదర్శ ఋషి దంపతులు గోచరిస్తారు. అనసూయ ఘనతను అత్రి మహర్షి స్వయంగా ప్రశంసించాడు. భార్యను శ్లాఘించి, ఆమె ప్రాధాన్యాన్ని భర్త కీర్తించడం పురాణాల్లో అనేక చోట్ల కనిపిస్తుంది. పురుషాధిక్యం అనేది లేనే లేదు,.
అసలు దాంపత్యంలో పరస్పరాధిక్యాలు తగనివి. ఒక్కో సమయంలో ఒక్కో విషయంలో ఒకరి ఆధిక్యం ఉంటుంది. అది అవసరం కూడా.
అన్యోన్యత కలిగిన దంపతుల పెంపకంలో ఎదిగే బిడ్డలు కూడా ఆరోగ్యవంతమైన మనశ్శరీరాలతో ప్రయోజకులుగా ప్రగతిని సాధించగలుగుతారు.
విశ్వనాథ వారి ’వేయిపడగలు’ లో భర్త భార్యతో అన్నమాట - చివరకు ’నేను మిగిలితిని - నీవు మిగిలితివి’.
ఇది ఆ నవలకే చివరిమాట. నాకు నచ్చిన మాట కూడా. వేయిపడగల అనంతునిలా విస్తరించిన మానవ ధర్మంలో 998 పడగలైన అసంఖ్యాక ధర్మాలు నశించినా కూడా ఇంకా ’భార్యాభర్తలు’ అనే రెండు పడగలు మిగిలాయి. అవి వున్నా చాలు .

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)