బోర్డ్ తిప్పిన రియల్ ఎస్టేట్ సంస్థ

Telugu Lo Computer
0

 

విజయవాడలో భారీ ‘రియల్ ఎస్టేట్’ మోసం వెలుగు చూసింది. భారీ వెంచర్ల పేరిట నానా హంగామా చేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఏకంగా బోర్డు తిప్పేసింది. కొనుగోలుదారుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టేసింది. బాధితులు, ఏజెంట్లు పోలీసులను ఆశ్రయించడంతో ఈ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. ఈ చీటింగ్ వ్యవహారం ఇపుడు విజయవాడలో కలకలం రేపుతోంది. విజయవాడతోపాటు హైదరాబాద్‌ వనస్థలిపురంలోను కార్యాలయాలను కలిగి వున్న ఎంకే కన్స్ట్రక్షన్స్ అండ్  డెవలపర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ మేరకు పలువురు బాధితులు విజయవాడ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు వెంచర్లపై ప్రచారం చేసుకున్న ఎంకే రియల్ డెవలపర్సర్ నిర్మాణాలు, ప్లాట్ల అమ్మకం పేరిట ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున వసూళ్ళకు పాల్పడింది. కొనుగోలుదారులు తమ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని కోరడంతో సంస్థ బోర్డు తిప్పేసింది. కంపెనీ బాధ్యులు ఫోన్లెత్తకుండా మాయమవడంతో ఏజెంట్లు అయోమయంలో పడ్డారు.

ఎంకే కంపెనీపై విజయవాడ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. రాజమండ్రికి చెందిన పట్నాల శ్రీనివాసరావు 2020 ఆగస్టులో గురునానక్ కాలనీలో ఎంకే రియల్ డెవలపర్స్ పేరిట కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కంపెనీకి ఛైర్మెన్‌గా ఉప్పు మనోజ్ కుమార్ వ్యవహరించారని, డైరెక్టర్ బలగం రవితేజ వుండేవారని బాధితులు చెబుతున్నారు. 20 మంది యువకులను ఏజంట్లుగా నియమించుకొని  నిర్మాణాలు, ఫ్లాట్లు అమ్మకం పేరిట లక్షలాది రూపాయలు అడ్వాన్సుగా  వసూలు చేసి,  తాజాగా బోర్డు తిప్పేసినట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరిట సుమారు 6 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. బాధితుల్లో విజయవాడ, గుంటూరు, కడప, శ్రీశైలం, విశాఖకు చెందిన వారున్నారు. వీరంతా ఏజెంట్లపై ఒత్తిడి తీసుకురావడంతో వారు విజయవాడ పటమట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)