ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కేకే అగర్వాల్ కరోనాతో కన్నుమూశారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS)లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. ఆయన రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా కొద్దిరోజుల కిందట ఆయనకు వైరస్ సోకింది. డాక్టర్ అగర్వాల్ కార్డియాలజిస్ట్. హార్ట్ కేర్ ఫౌండేషన్ ఇండియా అధిపతిగా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. 2010లో ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అంతకంటే ముందు- 2005లో డాక్టర్ బీసీ రాయ్ అవార్డును సొంతం చేసుకున్నారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచీ.. దాన్ని నివారించడానికి, కరోనా బారి నుంచి వేగంగా కోలుకోవడానికి అవసరమైన సూచనలు చేస్తూ వందల కొలది వీడియోలు చేశారు. ఆన్లైన్లో కరోనా గురించి అవగాహన కల్పించడంతో పాటు రోగుల సమస్యలను విని వారికి అవసరమైన ఔషధాలను కూడా సూచించారు. న్యూమోనియా వేధిస్తున్నప్పటికి ఆయన వీడియోలు చేస్తూనే ఉన్నారు.
ఆయన చివరి మాటలు
"నాకు కోవిడ్ న్యూమోనియా సోకింది తీవ్ర దశలో ఉంది. కానీ ఇలాంటి సమయంలోనే రాజ్ కపూర్ చెప్పిన మాటలు బాగా గుర్తొస్తాయి. "పిక్చర్ అబీ బాకీ హై (కధ అప్పుడే ముగియలేదు) ... షో కొనసాగాలి." అందుకే ఆక్సిజన్ పెట్టుకొనే క్లాసులు చెబుతున్నా, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను కేకే అగర్వాల్ ను కాదు. నేనొక డాక్టర్ని. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యుల చికిత్సా విధానం మారాలి. ఒకొక్కర్ని పిలిచి చూసే పద్దతి ఇప్పుడు లేదు ఒకే లక్షణాలు ఉన్న అందర్నీ ఒకేసారి చూసి చికిత్స అందించాలి. నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే, షో కొనసాగించాలి."