పార్ట్‌ టైం ఉద్యోగాల పేరుతో మోసగించిన ఇద్దరు సైబర్‌ కేటుగాళ్లు అరెస్ట్‌ !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సైబర్‌ క్రైం డీసీపీ కవిత తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు జనవరిలో కేసు నమోదు చేశామని, నిందితులు నౌషద్‌, కబీర్‌ కేరళలో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అరెస్టు చేసినట్టు చెప్పారు. కేసు వివరాలను శనివారం ఆమె మీడియాకు వెల్లడించారు. పార్ట్‌ టైం ఉద్యోగాల పేరుతో టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా బాధితులకు నిందితులు పరిచయమయ్యారు. ''లింక్‌ షేర్‌ చేసి.. దానిని క్లిక్‌ చేయడం ద్వారా బాధితులను టెలిగ్రామ్‌లో యాడ్‌ చేస్తారు. లైక్‌ చేయడం, లింక్స్‌ క్లిక్‌ చేయడం, అంతర్జాతీయ కంపెనీల రివ్యూలు రాయడం లాంటి టాస్క్‌లు ఇస్తారు. పార్ట్‌ టైం ఉద్యోగం కావడంతో బాధితులు అందులో చేరారు. జాబ్‌లో చేరిన తర్వాత కొంత నగదు వస్తుంది. పెట్టుబడులు పెట్టించి మరికొంత నగదు తిరిగి ఇస్తారు. వారి మాటలు నమ్మి బాధితులు రూ.9 లక్షలకుపైగా పెట్టుబడులు పెట్టారు. నిందితులు తిరిగి చెల్లింపులు చేయకుండా అకౌంట్‌ బ్లాక్‌ చేశారు. ఖాతా స్తంభించి పోయింది కాబట్టి.. నగదు రిలీజ్‌ అవ్వాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని చెబుతారు. వేర్వేరు అకౌంట్లలోకి డబ్బులు జమ చేయిస్తారు. ఇలాంటి 18 బ్యాంకు ఖాతాలను గుర్తించాం. ఇందులో రూ.26 కోట్ల అక్రమ నగదు బదిలీ చేశారని గుర్తించాం'' అని డీసీపీ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)