ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన, స్ఫూర్తివంతమైన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటారు. తాజాగా ఆయన అటల్ బిహారీ వాజ్పేయి మెమోరియల్ 4వ లెక్చర్లో ప్రసగించారు. తన కూతురు ఆపరేషన్ గురించి, ఆ క్లిష్ట సమయంలో నేర్పిన గుణపాఠం గురించి చెప్పుకొచ్చారు. ఈ వీడియోను ఆర్పీజీ గ్రూప్లో చైర్పర్సన్ హర్ష గోయెంకా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తన కూతురు ఏడాది వయసు ఉన్నప్పుడు చేతి వేలి ఆపరేషన్ కోసం పడిన ఇబ్బందులను కళ్లకు కట్టేలా వివరించారు. 'అది 1987.. ఆరోజుల్లో ఏడాది వయసున్న నా చిన్న కూతురు నడవడం నేర్చుకుంటోంది. ఆ సమయంలో ఆమె ఓ గాజు సీసా పట్టుకుని కిందపడడంతో గాజుముక్క చేతి వేలిలోని టెండాన్ను (కండను, ఎముకను కలిపే కణజాలం) తెంపింది. దీంతో టెన్షన్ పడిపోయి కొంందరి సలహా మేరకు లండన్లోని ప్రముఖ మైక్రో సర్జరీ డాక్టర్ను సంప్రదించాను. ఆపరేషన్ చేసిన ఆయన చిన్నారి కోలుకునేందుకు చేయి కదల్చలేని విధంగా చేయి చుట్టూ ఓ కాస్ట్ వేశారు. నెల రోజుల తర్వాత కాస్ట్ తీస్తే నా కూతురు చేతివేలు కదపలేకపోయింది. శస్త్రచికిత్స ఫెయిలైందని తెలిసి సర్జన్ కూడా షాక్ అయ్యాడు. ఆ తరువాత మరో సలహా మేరకు ప్యారిస్లోని మరో సర్జన్ డాక్టర్ గ్లిషెస్టైన్ను సంప్రదించాం. చిన్నారిని పరీక్షించిన డాక్టర్ మమ్మల్ని చూసి మీరు డాక్టర్ జోషీని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. తెల్లమొహం వేసిన నేను ఆయన ఎవరని ప్రశ్శించాను. ప్రపంచంలో అత్యంత ప్రముఖ హ్యాండ్ సర్జన్లలో ఒకరని తెలిపాడు. ఆయన భారతీయుడని, ముంబైలో ఉంటాడని చెప్పారు. తమకంటే ఎక్కువ అనుభవం ఉందని వెల్లడించాడు'' అని వివరించాడు. డాక్టర్ జోషి అడ్రస్ను ప్యారిస్ డాక్టర్ తనకు ఇచ్చాడని తెలిపారు. ఆయన ఆఫీసు మా కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉందని తెలిసి ఆశ్చయ్యపోయాను. వెంటనే ఇండియాకు వచ్చి ఆయనను కలిశాము. ఆ మరుసటి రోజే డాక్టర్ జోషి నా కూతురికి మళ్లీ ఆపరేషన్ చేశారు. ఈ తరహా కేసుల్లో ఆపరేషన్ కంటే పేషెంట్ ఎలా కోలుకుంటారనేది జోషి వివరించారు. గాయాన్ని మాన్పే క్రమంలో వేలిలో ఏర్పడి కొత్త కండరం వేలి కదలికను అడ్డంకిగా మారుతుందని తెలిపారు. దీనిని నివారించేందుకు జోషి చూపించిన సులువైన పరిష్కారం నా మతి పోగొట్టింది. ఆయన చిన్నారి చేతివేలికి ఓ చిన్న హుక్ (బ్లౌస్ హుక్ లాంటిది) జత చేశారు. ఆ తరువాత మణికట్టు వద్ద మరో బ్యాండేజ్ చుట్టి దానికి మరో హుక్ తగిలించారు. ఈ రెండింటినీ ఓ రబ్బర్ బ్యాండ్తో జతచేశారు. ఈ పరికరం ఖర్చు జస్ట్ రూ.2. ఇది వేలికదలికలకు అవకాశం ఇస్తూనే గాయం పూర్తిస్థాయిలో నయమయ్యేలా చేసింది. మరో పదేళ్ల తరువాత నా కూతురు పియానో కూడా వాయించింది'' అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఉదంతం గురించి నేను చాలా సార్లు చెప్పాను. మన సమస్యలకు పరిష్కారాలు సాధారణంగా మనకు సమీపంలోనే ఉంటాయని, ప్రతిసారీ విదేశాలవైపు చూడనక్కర్లేదన్న గుణపాఠం నేర్చుకున్నాను. ఇది నా కెరీర్ను మార్చేసింది. భారతీయ టెక్నాలజీని ఆ తరువాత మరెప్పుడూ సందేహించలేదు. భారతీయ టెక్నాలజీపై నమ్మకంతోనే భారీ పెట్టుబడులు పెట్టా, రిస్క్ తీసుకున్నా. 1990ల్లో స్కార్పియో కారు విషయంలో అలాంటి నిర్ణయమే తీసుకున్నా. నేటి విజయానికి అదే మూలం'' అని ఆనంద్ మహీంద్ర వివరించారు.
మన సమస్యలకు పరిష్కారాలు మనకు సమీపంలోనే ఉంటాయి !
March 21, 2024
0
Tags