చివరి టెస్ట్ మ్యాచ్లో భారత్ కు 255 పరుగుల ఆధిక్యం !

Telugu Lo Computer
0


భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది.  భారత్ 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో కుల్దీప్ యాదవ్ (27), జస్ ప్రీత్ బుమ్రా (19) పరుగులతో ఉన్నారు. ఓవర్ నైట్ స్కోరు 135/1తో రెండో రోజు ప్రారంభించిన టీమిండియా దూకుడుగా ఆడింది. టీమిండియా ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్(110) సెంచరీలతో చెలరేగారు. మరోవైపు.. వీరికి తోడు మిడిలార్డర్ లో దేవ్ దత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) పరుగులు చేయడంతో ఇండియా భారీ స్కోరు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రవీంద్ర జడేజా (15), దృవ్ జురెల్ (15), అశ్విన్ డకౌట్ అయ్యారు. ఇక.. ఇంగ్లండ్ బౌలర్లలో ఆఫ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. టామ్ హార్ట్లీ 2 వికెట్లు తీశాడు. అండర్సన్, స్టోక్స్ కు తలో వికెట్ దక్కింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ప్రధాన పేసర్ ఆండర్సన్ టెస్టుల్లో 700 వికెట్ల మైలురాయికి ఒక వికెట్ దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. భారత్ స్పిన్ బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కుల్దీప్‌ యాదవ్‌, అశ్విన్ చెలరేగడంతో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 5, అశ్విన్ 4 పడగొట్టారు. ఇదిలా ఉంటే.. భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టోకు ఇది 100వ టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)