ఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం పక్షపాతం చూపిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ సారథ్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆందోళనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్రం తీరును ఎండగడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు కాంగ్రెస్కు కౌంటర్గా ఢిల్లీ, కర్ణాటకలో బీజేపీ కూడా నిరసనలకు దిగింది. కేంద్రం ఇస్తున్న నిధులను కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోందని బీజేపీ ఆరోపించింది. సిద్ధరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నదాతలను ఆదుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. ఆందోళనలో భాగంగా బీజేపీ శ్రేణులు కర్ణాటకలో దూకుడుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయానికి తాళాలు వేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అదుపు చేసేందుకు వాటర్ ఫిరంగులు ఉపయోగించారు. ఈ సందర్భంగా బీజేపీ-పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
జంతర్మంతర్ దగ్గర సిద్ధరామయ్య, శివకుమార్ సారథ్యంలో నిరసన !
February 07, 2024
0
Tags