కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదాయానికి మించిన ఆస్తుల అంశంపై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అతని పెట్టుబడులకు సంబంధించిన వివరాలను కోరుతూ కేరళకు చెందిన జైహింద్ ఛానెల్కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దర్యాప్తు అధికారి కోరిన అవసరమైన పత్రాలతో జనవరి 11, 2024న తమ ముందు హాజరుకావాలని జైహింద్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ని ఏజెన్సీ ఆదేశించింది. శివకుమార్పై బెంగళూరులోని సీబీఐ విభాగం దర్యాప్తు చేస్తోంది. సిఆర్పిసి సెక్షన్ 91 కింద జారీ చేసిన నోటీసులో శివకుమార్, అతని భార్య ఉషా శివకుమార్ చేసిన పెట్టుబడుల వివరాలను అందించాలని ఏజెన్సీ ఛానెల్ని కోరింది. వారు చెల్లించిన డివిడెండ్లు, షేర్ల లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు స్టేట్మెంట్లు, హోల్డింగ్ల వివరాలను కోరింది. దీంతోపాటు ఖాతా పుస్తకాలు, ఒప్పంద వివరాలు సహా అన్ని లావాదేవీలను సమర్పించాలని సీబీఐ కోరింది. శివకుమార్ కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు ఈ ఛానెల్లో పెట్టుబడులు పెట్టినట్లు వచ్చిన సమాచారం మేరకు సీబీఐ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. తమకు సీబీఐ నోటీసు అందిందని ఏజెన్సీ కోరిన అన్ని పత్రాలను అందజేస్తామని జైహింద్ మేనేజింగ్ డైరెక్టర్ బీఎస్ షిజు తెలిపారు. రికార్డులన్నీ తమ వద్ద ఉన్నాయని, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేతృత్వంలోనే రాజకీయ ప్రతీకారానికి చర్యగా ఈ దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 2013 నుంచి 2018 మధ్య కాలంలో శివకుమార్ రూ.74 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని సీబీఐ తెలిపింది. అంతేకాదు ఇది తన ఆదాయానికి మించిన విధంగా ఉందని శివకుమార్పై 2020లో సీబీఐ కేసు నమోదు చేసింది.
జైహింద్ టీవీ ఛానెల్కు సీబీఐ నోటీసులు !
December 31, 2023
0
Tags