కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన మతపర కార్యక్రమంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఒకరు మరణించగా, 50 మందికిపైగా గాయపడ్డారు. అయితే కేరళతోపాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఈ పేలుళ్లకు తానే బాధ్యుడినని ఒక వ్యక్తి ప్రకటించాడు. డొమినిక్ మార్టిన్గా చెప్పుకున్న ఆ వ్యక్తి ఫేస్బుక్ లైవ్లో మాట్లాడాడు. 'నా పేరు మార్టిన్. యెహోవా సాక్షుల బృందం నిర్వహించిన సమావేశంలో బాంబు పేలుడు సంభవించింది. ఫలితంగా భారీ విధ్వంసం జరిగింది. ఈ సంఘటనకు నేను పూర్తిగా బాధ్యత వహిస్తాను. నేను ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డానో వివరించడానికి ఈ ఫేస్బుక్ లైవ్ నిర్వహిస్తున్నా' అని అతడు తెలిపాడు. కాగా, అనంతరం తొలగించిన ఆ ఫేస్బుక్ లైవ్లో మార్టిన్ మరిన్ని విషయాలు మాట్లాడాడు. 'ఆరేళ్ల క్రితం ఈ సంస్థ తప్పు అని, దాని బోధనలు దేశ వ్యతిరేకమని నేను గ్రహించా. దీనిని వారి దృష్టికి తీసుకువెళ్లా. వారి మార్గాలను సరిదిద్దమని కోరా. అయినప్పటికీ వారు ఇంకా అలా చేయడాన్ని సహించలేకపోయా. వారు బోధించే వాటిని నేను వ్యతిరేకిస్తున్నా. ఈ సంస్థ ఈ సమాజానికి అవసరం లేదని నేను పూర్తి దృఢ నిశ్చయంతో చెబుతున్నా. వెంటనే పోలీస్ స్టేషన్లో లొంగిపోతా' అని పేర్కొన్నాడు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఫేస్బుల్ లైవ్లో మాట్లాడిన డొమినిక్ మార్టిన్, త్రిసూర్లో పోలీసులకు లొంగిపోయిన పేలుళ్ల అనుమానితుడు 48 ఏళ్ల మార్టిన్ ఒకరేనా అన్నది స్పష్టం కాలేదు.
ఫేస్బుక్ లైవ్లో మాట్లాడిన కేరళ పేలుళ్ల అనుమానితుడు ?
October 29, 2023
0
Tags