రాజస్థాన్ బరిలో ఏడుగురు బిజెపి ఎంపిలు !

Telugu Lo Computer
0

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడడంతో ఆ రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ మరో విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. రాజస్థాన్‌లో తొలి జాబితాను విడుదల చేయగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు కూడా అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు 41 మంది అభ్యర్థులతో బీజేపీ సోమవారం తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఎంపీలకు టికెట్లు కేటాయించింది. జోత్వారా నుంచి ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, విద్యాధర్ నగర్ నుంచి ఎంపీ దియా కుమారి, తిజారా నుంచి ఎంపీ మహంత్ బాలక్‌నాథ్, సవాయ్ మాథోపూర్ నుంచి రాజ్యసభ ఎంపీ కిరోది లాల్ మీనాను బరిలోకి దింపింది. అయితే తొలిజాబితాలో మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే పేరు లేకపోవడం గమనార్హం. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. మధ్యప్రదేశ్ ఎన్నికలకు 57 మందితో బీజేపీ సోమవారం మూడో జాబితాను ప్రకటించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన స్వంత నియోజక వర్గం బుధ్నీ నుంచే పోటీ చేస్తారు. డాట్ల స్థానం నుంచి రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పోటీ చేస్తారు. సోమవారం ప్రకటించిన 57 మంది జాబితాను పార్టీ చీఫ్ జెపి నడ్డా, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులతో కూడిన బీజేపీ సెంట్రల్ ఎలెక్షన్ కమిటీ అంగీకరించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలుండగా, తాజా జాబితాతో కలిపి బీజేపీ ఇప్పటివరకు 135 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 64 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ …. రాజ్‌నంద్‌గావ్ నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్‌సావో లోర్మీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రాష్ట్రం లోనూ పలువురు ఎంపీలను పోటీకి దించింది. ఎంపీలు రేణుకాసింగ్, గోమతిసాయ్, ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. 90 శాసన సభ నియోజకవర్గాలున్న ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ తొలి విడతలో 21 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 85 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)