తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన అఖిల భారత మత్స్యకారుల మహాసభలో కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పీ.చిదంబరం ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అయోమయంలో పడిందని, దానికి వీడ్కోలు పలకాలని అన్నారు. ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనైనా సరే, 10 ఏళ్లకు ఒకసారి మార్చాలని అనడం గమనార్హం. ''ద్రవ్యోల్బణం, ధరలను నియంత్రించలేని, ఉద్యోగాలు కల్పించలేని పనికిమాలిన బీజేపీ ప్రభుత్వానికి వీడ్కోలు పలకండి'' అని పీ.చిదంబరం అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడం లేదని ఆయన అన్నారు. ''ధరలను నియంత్రించని, ఉపాధిని సృష్టించని ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా పరిగణించలేము. పదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారాలని నా అభిప్రాయం. ఇది మంచి విషయమే. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా మార్చాల్సిందే'' అని చిదంబరం అన్నారు. ద్రవ్యోల్బణం సమస్యపై చిదంబరం మాట్లాడుతూ ద్రవ్యోల్బణం 6 శాతానికి పైగా చేరిందని, అది 4 శాతానికి మించకూడదని అన్నారు. 9 ఏళ్ల బీజేపీ పాలనలో యువతకు నిరుద్యోగం తగ్గలేదన్నారు. ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం, ఆర్థికాభివృద్ధి అంటే ధరలను నియంత్రించడం, ఉపాధిని పెంచడం, దేశీయ పొదుపులను పెంచడం, రుణాన్ని తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమని అన్నారు. 10 ఏళ్ల క్రితం ఎన్నికల సమయంలో 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మరిచిపోయారని చిదంబరం దుయ్యబట్టారు. ఇందులో 22 శాతం మంది 15 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల యువకులని అన్నారు. "భారతదేశంలో 42 శాతం గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులు, 8.1 శాతం మంది యువత నిరుద్యోగులు'' అని చిదంబరం అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. "గత సంవత్సరం, భారతదేశంలోని ప్రజల ఐక్యత, సోదరభావాన్ని నొక్కి చెప్పడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 51 ఏళ్ల యువకుడు (రాహుల్ గాంధీ) 4,000 కిలోమీటర్లు పాదయాత్రి చేశారు. 21వ శతాబ్దంలో రాహుల్ గాంధీ మాత్రమే ఈ ఘనత సాధించారు'' అని అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను టార్గెట్ చేస్తూ, హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడమే ఎన్నికల్లో గెలవడానికి మార్గమన్న నమ్మకంతో ఆయన పనిచేస్తున్నారని చిదంబరం దూషించారు.
ఏ ప్రభుత్వానైనా సరే 10 ఏళ్లకు ఒకసారి మార్చాలి !
October 01, 2023
0
Tags