భారత్‌కు ప్రత్యేకమైన మినహాంపులుండవు !

Telugu Lo Computer
0


భారత్‌ - కెనడా వివాదంలో అగ్రరాజ్యం అమెరికా నెమ్మదిగా స్వరం మారుస్తున్నది. ఇరుదేశాల మధ్య పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు ఇటీవల పేర్కొన్న అమెరికా తాజాగా కెనడా వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది. విచారణలో భారత్‌కు ఎటువంటి మినహాయింపులు ఉండవని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సలివాన్‌ తెలిపడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం నిజ్జర్‌ హత్య అంశాన్ని ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తున్నది. దీంతో అమెరికా స్వరం మారుస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. కెనడా-భారత్‌ మధ్య నెలకొన్న వివాదంపై సలివాన్‌ స్పందించారు. 'భారత దౌత్యవేత్తలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. భారత్‌కు ప్రత్యేకమైన మినహాంపులు ఏం ఉండవు. కెనడాతో మాకు విభేదాలు లేవు. కెనడాతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉంటాం' అని ఆయన పేర్కొన్నారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిజ్జర్‌ హత్య అంశాన్ని ప్రధాని మోడీతో భేటీలో ప్రస్తావిచించినట్టు తెలుస్తున్నది. జో బైడెన్‌తో పాటు ఫైవ్‌ ఐలో ఉన్న ఇతర దేశాల నేతలు కూడా మోడీ వద్ద ఈ అంశాన్ని లేవనెత్తినట్టు బ్రిటన్‌ పత్రిక ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత హస్తం ఉన్నట్టు కెనడా వద్ద ఆధారాలున్నట్టు తెలుస్తున్నది. పక్కా సాక్ష్యాధారాలతోనే కెనడా ఆరోపణలు చేస్తున్నట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. ఈ మేరకు సీబీఎస్‌ న్యూస్‌ వెల్లడించింది. సాక్ష్యాధారాలు ఉండటంతోనే కెనడా ప్రధాని ట్రూడో తీవ్రమైన ఆరోపణలు చేసినట్టు ఆ పత్రిక వెల్లడించింది. అందుకే దౌత్యపరమైన సంబంధాలను కూడా లెక్కచేయకుండా ఆయన భారత్‌వైపు వేలు చూపారని ఆ కథనంలో పేర్కొంది. నిజ్జర్‌ హత్య వెనుక భారత హస్తం ఉన్నట్టు ఫైవ్‌ ఐ నెట్‌వర్క్‌లోని ఓ దేశానికి చెందిన ఇంటెలిజెన్స్‌ వర్గాలు కెనడాకు ఆధారాలు అందించినట్టు ఆ పత్రిక తెలిపింది. కెనడా వద్ద హ్యూమన్‌, సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నట్టు కెనడా ప్రభుత్వ ప్రతినిధులు కూడా ధ్రువీకరించినట్టు పేర్కొంది. భారత దౌత్య అధికారుల సంభాషణలు కూడా ఉన్నట్టు తెలిపింది. మరోవైపు విచారణకు హాజరుకావాలని భారత అధికారులను కెనడా కోరినట్టు వెల్లడించింది. కెనడా నేషనల్‌ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్‌ అడ్వైజర్‌ థామస్‌ ఆగస్టు, సెప్టెంబర్‌లో భారత్‌లో పర్యటించారని పేర్కొంది. ఈ ఆరోపణలను భారత దౌత్యవేత్తలు ఖండించలేదని వివరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)