తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంతోపాటు రాష్ట్రంలోని విద్యార్థులకు వైద్యవిద్యను మరింత చేరువ చేసేందుకు వీలుగా ఈ నెల 15న మరో తొమ్మిది వైద్య కళాశాలల్లో తరగతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. గత ఏడాది ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రాగా ఈ ఏడాది మరో తొమ్మిది ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో గురువారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కొత్తగా ప్రారంభించనున్న తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కరీంనగర్, భూపాలపల్లి, నిర్మల్, వికారాబాద్, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జనగామ వైద్య కళాశాల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని వసతులు ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. రాష్ట్రం ఏర్పడక ముందు సదరు ప్రాంతంలో కేవలం 5 ప్రభుత్వ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం ప్రారంభించే కళాశాలలు కలిపి మొత్తం 26కి చేరుకున్నాయని వెల్లడించారు. ఈ కొత్త విద్యాసంస్థలు ప్రారంభిస్తే 900 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు(2014) 5 అయిదు వైద్య కళాశాలల ద్వారా 850 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని.. ఇప్పుడు 3,915 సీట్లు విద్యార్థులకు అందుబాటులో వచ్చాయని చెప్పారు.
ఒకే రోజు 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం !
September 08, 2023
0
Tags