లగేజీ సెంటర్లల్లో డిజిటలైజేషన్, ఆటోమేషన్ వ్యవస్థ అమలు !

Telugu Lo Computer
0


తిరుమలకు వచ్చే భక్తులు తమ లగేజీ, మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసి, స్వామివారి దర్శనానంతరం వాటిని తిరిగి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేసింది. మరింత సులభంగా వాటిని తిరిగి తీసుకోవడానికి లగేజీ సెంటర్లల్లో డిజిటలైజేషన్, ఆటోమేషన్ వ్యవస్థను అమలు చేస్తోంది. ఈ వ్యవస్థకు భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోందని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేస్తే తిరిగి తీసుకోవడం ఆలస్యమవుతుందని భావించడం వల్ల కొందరు భక్తులు వాటిని తమ వెంట తీసుకుని దర్శనానికి వెళ్లే ప్రయత్నం చేస్తోన్నారని అన్నారు. ప్రస్తుత విధానంలో లగేజీ గానీ, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను డిపాజిట్ చేస్తే ఎంతో సమయం వేచి ఉండకుండా సులభంగా వాటిని తిరిగి పొందవచ్చని అన్నారు. భక్తులు లగేజి కౌంటర్ వద్దకు చేరుకోగానే వారి వద్ద ఉన్న దర్శన టికెట్‌ను స్కాన్ చేసి, వాటి వివరాలు ఎలక్ట్రానిక్ డివైస్‌లో ఆటోమేటిక్‌గా నిక్షిప్తం చేస్తామని వివరించారు. దర్శన టికెట్ లేని భక్తులకు వారి వివరాలు, పేరు నమోదు చేసుకుని బ్యాగ్‌కు ఆర్ఎఫ్ఐడి నిక్షిప్తమైన ట్యాగ్‌ను టైప్ క్లిప్ ద్వారా జతపరిచి ఆటోమేటిక్ జనరేటెడ్ క్యూఆర్ కోడ్ రసీదును ఇస్తామని ధర్మారెడ్డి చెప్పారు. అదేవిధంగా మొబైల్ డిపాజిట్ సమయంలో దర్శన టికెట్, ఆధార్, భక్తుల వివరాలు సేకరిస్తారని పేర్కొన్నారు. వారి మొబైల్ ను భద్రంగా పౌచ్‌లో ఉంచి వాటిని క్యూఆర్ కోడ్‌కు అనుసంధానం చేసి భక్తులకు రసీదు అందజేస్తారని తెలిపారు. వాహనాలకు జీపీఎస్ అమర్చడం వల్ల భక్తులకు వారి లగేజ్ చేరే సమయం మెసేజ్ రూపంలో అందుతుందని ధర్మారెడ్డి తెలిపారు. లగేజీ కౌంటర్ బయట ఉన్న డిస్ ప్లే కియోస్కుల ద్వారా రసీదులను స్కాన్ చేస్తే లగేజి చేరిందా? లేదా? తెలిసిపోతుందని పేర్కొన్నారు. వాహనం ద్వారా లగేజీని తీసుకోవడానికి ఉద్దేశించిన సెంటర్లకు వెళ్లి ట్రాలీ సహాయంతో కలర్ కోడింగ్ విధానంతో కౌంటర్లకు పంపుతామని చెప్పారు. భక్తుల రసీదును ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా స్కాన్ చేయడంతో వారి మొబైల్, లగేజీ భద్రపరిచిన సెల్ఫ్ రాక్ నెంబర్ తెలుస్తుందని, తద్వారా సులభంగా లగేజి పొందవచ్చని తెలిపారు. ఈ విధానం నెల రోజులుగా అమలువుతోందని, దీనికి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. ప్రతిరోజు 60 వేల మొబైల్ ఫోన్లు, 40 వేలకు పైగా బ్యాగులను డిపాజిట్, డెలివరీ చేస్తోన్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. ప్రస్తుత విధానంలో 16 కేంద్రాల ద్వారా 44 కౌంటర్లలో ఈ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన చెప్పారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనం, సర్వదర్శనం, సుపథం, శ్రీవారి మెట్టు, అలిపిరి వద్ద డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా కామన్ లగేజ్ కేంద్రాల వద్ద 20 కౌంటర్లు, జిఎన్సి వద్ద 6 కౌంటర్లు, టీబీసీ వద్ద 2 లగేజీ తిరిగి ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ttd,దర్శనానంతరం వాటిని తిరిగి తీసుకునే ప్రక్రియను వేగవంతం,

Post a Comment

0Comments

Post a Comment (0)