సైకిల్ పై కళ్యాణ మండపానికి చేరుకున్న వరుడు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వరుడు కల్యాణమండపానికి సైకిల్ పై వచ్చిన విధానం అందరినీ ఆకర్షించింది. దీనిని చూసిన వారంతా పెళ్లికొడుకును అభినందించలేకుండా ఉండలేకపోయారు. చక్కగా అలంకరించిన కారులోనే లేదా గుర్రం మీదనో నూతన వరుడు కల్యాణమండపానికి చేరుకోవడం ఆనవాయితీ. వీటికి భిన్నంగా ఏ వరుడైనా ప్రవర్తిస్తే అందరూ అతనిని వింతగా చూస్తారు. ఇటువంటి ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. వరుడు తనదైన ప్రత్యేక రీతిలో వధువు ఇంటికి తన బంధుబలగంతో సహా చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను చాటాలని భావిస్తూ వాధ్వానీ కుటుంబం ఈ వినూత్న ప్రయోగం చేసింది. ఇందుకోసం వారు సైకిళ్లను వినియోగించారు. వరునితో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులంతా సైకిళ్లపై ఊరేగింపుగా కల్యాణమండపానికి చేరుకున్నారు. ఈ ఊరేగింపు ఇండోర్‌లోని లాల్‌బాగ్‌ గార్డెన్‌ నుంచి ఖాల్సా గార్డెన్‌ ఖాతీవాలా ట్యాంక్‌ వరకూ సాగింది. దీనికి వారు 'మినీ బారాత్‌' అనే పేరుపెట్టారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తేజాజీ నగర్‌ పరిధిలోని లింబూదీలో ఉంటున్న అన్మోల్‌ వాద్వానీకి ఇండోర్‌లోని డింపుల్‌తో జూన్‌ 11న వివాహం నిశ్చయమయ్యింది. తన వివాహ వేడుక ఎప్పటికీ గుర్తుండిపోవాలని, అందరికీ స్ఫూర్తినివ్వాలనే తన ఉద్దేశాన్ని వరుడు తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీనికి వారు సమ్మతించడంతో వారంతా సైకిళ్లపై ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నారు. పర్యావరణ హితం కోరుతూ వారంతా ఈ నిర్ణయానికి మద్దతు పలికారు. వీరిని చూసిన స్థానికులు నూతన వరుడిని అభినందనలతో ముంచెత్తారు. కాగా వరునితోపాటు అతని తరపువారంతా సైకిళ్లపై ఊరేగింపుగా రావడంతో ఆడపెళ్లివారు మొదట ఆశ్చర్యపోయినా, తరువాత వారి సదుద్దేశాన్ని తెలుసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)