వయాగ్రా కోసం వెళ్లిన వారు గల్లంతు !

Telugu Lo Computer
0


హిమాలయన్ వయాగ్రాగా పిలిచే అత్యంత విలువైన మూలిక కోసం వెళ్లినవారు గల్లంతైన ఘటన నేపాల్ లో చోటు చేసుకుంది. హిమాలయన్ వయాగ్రా లేదా యార్సగుంబా కోసం వెళ్లిన ఐదుగురు వ్యక్తులు పశ్చిమ దార్చులా జిల్లాలో హిమపాతంలో సమాధి అయ్యారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో హిమాలయన్ వయాగ్రా మరోసారి చర్చకు వచ్చింది. ఇదో రకం శిలీంధ్రం. హిమాలయాల్లో మాత్రమే దొరికే అరుదైన మూలిక ఇది. అనేక ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తుందని, లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుందని నమ్ముతారు. పేరుకే హిమాలయన్ వయాగ్రా  అయినా ఇది అంతకు మించి..! లైంగిక సామర్ధ్యాన్ని పెంచడంలో దీన్ని మించినది లేదంటారు. ఇప్పుడు మార్కెట్‌లో దొరికే వయాగ్రాలేవీ దీని ముందు పనికిరావు. ఇది సహజసిద్ధమైనది. వెయ్యేళ్ల క్రితమే దీన్ని లైంగిక పటుత్వ చికిత్సల్లో వాడినట్లు చెబుతారు. అందుకే దీనికి అంత డిమాండ్. వీటిని మందుల తయారీకి ఉపయోగిస్తుంటారు. కొంతమంది దీన్ని నేరుగా టీ, సూపుల్లో కలుపుకుని కూడా తాగుతుంటారు. భారత్‌లో దొరికే రకంతో పోల్చితే నేపాలీ రకానికి డిమాండ్ ఎక్కువ. కఠినమైన చలి గాలులు, మంచును  తట్టుకుని ఈ మూలికను అన్వేషిస్తారు. కొన్ని కుటుంబాలు దీనిపై ఏటా రూ.5-6లక్షలు సంపాదిస్తున్నాయి. ‘మిస్ అయిన వారిలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వాతావరణ పరిస్థితి కూడా బాగా లేదు’ అని డిప్యూటీ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ప్రదీప్ సింగ్ ధామి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బోలిన్‌లోని బయాన్స్ విలేజ్ కౌన్సిల్- 01 వద్ద భారీ హిమపాతం సంభవించిందని ఓ అధికారి తెలిపారు. యార్సగుంబా మూలిక అన్వేషణలో భాగంగా అక్కడ టెంట్లు వేసుకున్న 12 మంది ఆ మంచు తుపానులో గల్లంతయ్యారని, వెంటనే స్పందించిన స్థానికులు భద్రతా దళాలకు సమాచారం ఇచ్చారని అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది కొందరిని కాపాడిందని, ఐదుగురి ఆచూకీ దొరకలేదని చెప్పారు. వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)